Tuesday, April 16, 2024

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు కేంద్రానికి ఆకర్షణీయమైన ముఖద్వారం.. మన్ననూరు వద్ద కొత్త చెక్‌ పోస్టులు  

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల బృందం ఆదివారం అమ్రాబాద్‌ రిజర్వులో పర్యటించింది. అటవీశాఖ నేతృత్వంలో పులుల అభయారణ్యం పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేంద్ర బృందం పరిశీలించింది. శ్రీశైలం దారిలో మన్ననూరు వద్ద అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు కేంద్రానికి కొత్తగా ఏర్పాటు చేసిన ముఖ ద్వారాన్ని అధికారులతో కలిసి డైరెక్టర్‌ జనరల్‌ చంద్రప్రకాశ్‌ గోయల్‌ ప్రారంభించారు. టైగరు రిజర్వు విశిష్టతను కాపాడుతూ అటవీశాఖ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను కేంద్రం బృందం ప్రశంసించింది. అమ్రాబాద్‌ నుంచి దోమలపెంట దాకా సుమారు 70 కిలోమీటర్ల మేర రహదారిని ప్లాస్టిక్‌రహితంగా ఉంచేందుకు అటవీశాఖ తీవ్రంగా కృషి చేస్తోంది.

పర్యాటకులు, ప్రయాణికులు ప్లాస్టిక్‌, గ్లాస్‌ వస్తువులను వదిలేస్తే, రోజూవారీ చెత్తను వెంటనే సేకరించి మన్ననూరులో ఏర్పాటు చేసిన రీసైక్లింగ్‌ కేంద్రానికి తరలించేందుకు 15 మంది చెంచులతో కూడిన బృందాన్ని అటవీశాఖ ఏర్పాటు చేసింది. టైగర్‌ రిజర్వు కేంద్రాల్లో ఈ రకమైన రీసైక్లింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం దేశంలోనే మొదటిసారి అని కేంద్ర బృందం మెచ్చుకుంది. దీనితో అభయారణ్యంలో జంతువులకు ప్లాస్టిక్‌ చేరకుండా అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు అన్నారు.

మన్ననూరులో ఉన్న వైజ్ఞానిక, పర్యావరణ కేంద్రాన్ని, జంతు విసర్జితాలు, అవశేషాలను విశ్లేషించి, అధ్యయనం చేసే బయోల్యాబ్‌ను ఉన్నతాధికారులు ఈమేరకు పరిశీలించారు. అపోలో ఫౌండేషన్‌ సహకారంతో చెంచు మహిళలకు ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ప్యాకేజింగ్‌ వర్క్‌షాప్‌ను అధికారుల బృందం ప్రారంభించింది. టైగర్‌ రిజర్వు పరిధిలో వాడేందుకు వీలుగా పర్యావరణహిత జ్యూట్‌ బ్యాగులు, ఇతర సామాగ్రిని చెంచులతో తయారు చేయించేందుకు వీలుగా ఒక కేంద్రాన్ని మన్ననూరులో అటవీశాఖ ఏర్పాటు చేసింది. అలాగే అపోలో ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాన్ని కూడా కేంద్ర బృందం పరిశీలించింది. అటవీశాఖ సిబ్బందితో పాటు గిరిజనులకు అవసరమైన వైద్యం, మందుల సహాయాన్ని ఈ కేంద్రం అందిస్తుంది. వేసవిలో వన్యప్రాణులకు నీటి సౌకర్యాన్ని అందించేందుకు వీలుగా సంపెన్‌ పడేల్‌ గడ్డి క్షేత్రం దగ్గర సోలార్‌ బోర్‌వెల్‌ను అధికారులు ప్రారంభించారు.

అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో జంగల్‌ సఫారీ ద్వారా పర్యటించిన కేంద్ర అధికారుల బృందం అటవీ నిర్వహణపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అచ్చంపేట అటవీ కార్యాలయంలో చౌసింగా పేరుతో మీటింగ్‌ హాల్‌, నల్లమల అటవీ ప్రాంతానికి ప్రత్యేకమైన ఔషధ మొక్కలతో కూడిన మెడిసినల్‌ గార్డెన్‌ ప్రారంభించడంతో పాటు కొత్తగా నిర్మించనున్న అటవీ అమరువీరుల స్థూపానికి అధికారులు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర జాతీయ పులుల సంరక్షణ కేంద్రం అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ యాదవ్‌, నేషనల్‌ కంపా సీనియర్‌ అధికారి రమేష్‌ పాండే, ఉత్తరప్రదేశ్‌ పీసీసీఎఫ్‌ మధు శర్మ, పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫీల్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, నాగర్‌కర్నూల్‌ డీఎఫ్‌వో కృష్ణాగౌడ్‌, ఎఫ్‌డీవో రోహిత్‌ గోపిడి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement