Saturday, April 20, 2024

ఆదిలాబాద్ లో స్వై‌న్ ఫ్లూ కలకలం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ మహిళకు స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్యులు నిర్దారించారు. దీంతో ఆమెకు రిమ్స్‌లో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో స్వైన్ ఫ్లూ తొలి కేసు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా 516 మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల ద్వారా నిర్వహించిన పరీక్షల్లో 2441 మంది వైరల్‌ జ్వరాల బారిన పడినట్లు నిర్ధారించారు. దీంతో పాటు 813 మంది డయేరియాతో అస్వస్థతకు గురైనట్లు పేర్కొంటున్నారు. జ్వరాలకు తోడుగా దగ్గు, జలుబు కూడా సాధారణ ప్రజానీకాన్ని సతమతం చేస్తోంది. గత 20 రోజుల నుంచి ఓ వైపు జ్వరాలు, మరోవైపు డయేరియా, దగ్గు, జలుబు లాంటివి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండడంతో వారంతా ఆసుపత్రుల భాటపడుతున్నారు. జిల్లాలోని 17 పీహెచ్‌సీలతో పాటు ఇక్కడి ప్రధాన జిల్లా ఆసుపత్రికి జ్వర బాధితులు క్యూ కడుతున్నారు. అయితే జ్వర తీవ్రత తగ్గకపోవడంతో చాలా మంది ప్రైవేటు ఆసుపత్రుల బాటపడుతున్నారు. జ్వర పీడితులతో జిల్లా కేంద్రంతో పాటు బైంసా, ఖానాపూర్‌లలోని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు కిటకిటలాడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement