Thursday, March 28, 2024

ఊరటనిస్తోన్న ప్రభుత్వ సహాయం..

కాసిపేట : కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసివేయబడ్డాయి. దాంతో ప్రైవేట్ విద్యా సంస్థల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి కష్టాలు వచ్చిపడ్డాయి. ఆదుకునే ఆపన్న హస్తాలకే ఎదురు చూస్తున్న వేతన జీవులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సహాయం కొంత ఊరటనిచ్చింది. బియ్యంతో పాటు నగదు సహాయాన్ని ఈ నెల నుండి అమలులోకి తీసుకురావడంతో పాటు పంపిణి చేస్తుండడంతో వారిలో మనోనిబ్బరాన్ని కలుగచేసింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు బోధన, బోధనేతర సిబ్బంది దాదాపు 2,018 మంది వున్నట్టు సంబందిత అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రైవేట్ బోధన సిబ్బంది వివరాలను ఆయా మండలాల విద్యాధికారులు.. సిబ్బంది బ్యాంక్‌ అకౌంట్‌ లు, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి రాష్ట్ర విద్యాశాఖకు గడువులోగానే పంపించారు. అయితే సర్కార్‌ ఇచ్చిన హామి మేరకు సిబ్బందికి ఆర్థిక సహాయాన్ని ముందుగా ఈ నెల 19 నుండే బ్యాంక్‌ ఖాతాలో జమచేయడంతో వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అర్హులైన ప్రతి బోధన, బోధనేతర సిబ్బంది ఖాతాలో రెండు వేల రూపాయలు నగదు జమతో పాటుగా సమీప రేషన్‌ షాపుల్లో 25 కిలోల బియ్యం పంపిణి చేస్తుండండంతో బడుగుజీవుల కుటుంబాల్లో సంతోషాలు నిండుకున్నాయి. అందివస్తున్న సహాయం కొండంత అండగా వారు.. వారి కుటుంబ సభ్యులు
తలుస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గి, పాఠశాలలు పునరుద్దరించే వరకు ఈ సహాయం అందిరానుండడం, ఆపద సమయంలో సర్కార్‌ అందించే కొద్ది సహాయమైన వారిలో కొండంత మనోధైర్యాన్ని కలుగచేస్తుందనడంలో అతిశయోక్తికాదు.
పలు మండలాల్లో లబ్దిదారులు
ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పలు మండలాల్లో వున్న లబ్దిదారులు ఈ నెల నుండే నగదుతో పాటు బియ్యం సైతం అందుకునే వారు దాదాపు 2,018 వుండగా వారిలో 115 మంది నాన్‌ టీచింగ్‌ వున్నట్టు సమాచారం. బెల్లంపల్లి మండలంలో 222 మంది లబ్దిదారులు, భీమినిలో 10, భీమారం 14, చెన్నూర్‌ 129, దండేపెల్లి 88, హాజిపూర్‌ 80, జైపూర్‌ 27, జన్నారం 122,కన్నెపెల్లి 24, కాసిపేట 20, కోటపెల్లి 5, లక్షెట్టిపెట 131, మంచిర్యాల 670, మందమర్రి 730, నస్పూర్‌ 189, నెన్నెల 9, తాండూర్‌ 66, వేమనపెల్లి మండలంలో 15 మంది లబ్దిదారులుగా సహాయాన్ని అందుకుంటున్న వారిలో వున్నారు. ఈ నేపధ్యంలో పలు మండలాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు అబ్దిదారులకు ప్రభుత్వ రేషన్‌ షాపుల్లో బియ్యం పంపిణిని కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా మహామ్మారి అన్ని వర్గాల వారిని కబలిస్తోంది. ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు ప్రతి ఒక్కరు కోవిడ్‌ నిబ్బంధనలు తప్పక పాటించాల్సిన సామజిక బాద్యత వుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పలువురు తమ అభిప్రాయాలను ఈ సందర్బంగా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement