Saturday, April 20, 2024

జనహిత సేవలు అభినందనీయం

—జిల్లా జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ
—కోవిడ్‌-19 ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు సత్కారం
—పలువురికి ప్రతిభా పురస్కారాల అందజేత

బెల్లంపల్లి, జనహిత సేవలు అభినందనీయమని జెడ్‌పి జిల్లా వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ అన్నారు. సోమవారం రాత్రి జనహిత సేవా సమితీ 4వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం కళ్యాణి-భీమాగౌడ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మోటపలుకుల రాజశేఖర్‌, వన్‌టౌన్‌ సీఐ రాజులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా కళాకారుడు రేగుంట పోచం వేణుగానంతో,స్పూర్తి ప్రియ, సాహిత్యలు కూచీపూడి నృత్యంతో ఆకట్టుకున్నారు. అనంతరం జనహిత సేవా సమితీ ఏప్రిల్‌ 13వ తేది ఉగాది పర్వదినం నుండి ప్రతీ బుధవారం ఉచిత అన్నధానం కార్యక్రమం లోగోను ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాధంలో అకాల మరణం చెందిన సామాజిక కార్యకర్త జనార్దన్‌ కుటుంబానికి జనహిత సేవా సమితీ సభ్యుల ద్వారా సేకరించిన రూ.16వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి జనహిత సేవా సమితీ చేస్తున్న సేవలు చలివేంద్రం ఏర్పాటు, నిరుపేదలకు ఇంటి నిర్మాణం, ఆసుపత్రిలో అల్పాహారం పంపిణీ, అన్నధాన కార్యక్రమాలు అభినందనీయమని, అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో జనగణమన జాతీయ గీతాలాపన కార్యక్రమం ప్రారంభానికి తమవంతు కృషి చేస్తామని అన్నారు. అనంతరం జనహిత సేవా సమితీ అధ్యక్షుడు ఆడెపు సతీష్‌ మాట్లాడుతూ 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జనహిత సేవా
సమితీకి సహాయ సహకారాలు అందిస్తున్న సభ్యులకు, భాగస్వామ్యులకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు, బెల్లంపల్లి ఐసోలేషన్‌ వైద్య సిబ్బందికి, పోలీస్‌ సిబ్బందికి, మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు, మండలంలోని పారిశుద్ధ్య కార్మికులకు, బెల్లంపల్లి పరిధిలో కళలు, క్రీడారంగాల్లో ప్రతిభ కనబర్చిన, వేణుగానం కళాకారుడు రేగుంట పోచంకు, జాతీయ స్థాయి అంధుల క్రికెట్‌ క్రీడాకారుడు మల్లెపల్లి సాగర్‌, మిమిక్రి కళాకారుడు గరిగె వేణుగోపాల్‌కు, వాసవి బృంధం సభ్యుడు చిలువేరు దయాకర్‌కు, అమ్మఒడి ఎన్‌జీఓ సభ్యుడు హనుమాండ్ల మధూకర్‌కు, బెల్లంపల్లి తాజ్‌ బేకరీ సేవకుడు ఉస్మాన్‌ బాయ్‌లకు ప్రశంస పత్రాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ గెల్లి రాజలింగు, టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్‌, జనహిత సేవా సమితీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి, కోశాధికారి కొడిపెల్లి గిరిప్రసాద్‌, సహాయ కార్యదర్శులు దాసరి రంజీత్‌గౌడ్‌, జక్కుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంజాల కుమార్‌, గౌరవ సలహాదారులు నిచ్చకోల రాజన్న, దాసరి సత్యనారాయణగౌడ్‌, మూర్కూరి బాలాజీ, జనహిత సేవా సమితీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement