Friday, April 19, 2024

‘మా’ వివాదాలన్నింటికీ నరేశే కారణం: శివాజీరాజా

‘మా’ ఎన్నికలు వేడి పెంచుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజా మాజీ అధ్యక్షుడు నరేశ్ పై ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న వివాదాలన్నింటికీ కారణం నరేశేనని ఆయన ఆరోపించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. గత ఏడాది నాగబాబు మద్దతు ప్రకటించకపోయి ఉంటే నరేశ్ అసలు గెలిచి ఉండేవారేకాదని అన్నారు. నరేశ్ ఆడే పాచికలాటలో ప్రాణ మిత్రులు కూడా విడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. నరేశ్ ఎప్పుడూ అబద్ధాలే చెబుతాడని, ఆయన నోటివెంట నిజం వచ్చిన నాడు ఆశ్చర్యపోవాల్సిందేనని పేర్కొన్నారు. తనపై నరేశ్ ఎన్నెన్నో అసత్యాలు ప్రచారం చేశాడని తెలిపారు.

నరేశ్ రాకతోనే అసోసియేషన్ లో రాజకీయాలు మొదలయ్యాయని శివాజీ రాజా తెలిపారు. తాను మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాలో ఫండ్ రైజింగ్ ఈవెంట్ ను నిర్వహించామన్న శివాజీరాజా.. అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్న నరేశ్ మాత్రం రాలేదని గుర్తు చేశారు. అమెరికా రాకుండా మీటింగ్ పెట్టి తనపై అబద్ధాలు చెప్పారన్నారు. నటీనటుల విమాన టికెట్ల డబ్బులను తాను, శ్రీకాంత్ వాడుకున్నామని ఆరోపించారని చెప్పారు. అయితే, అవన్నీ అబద్ధాలేనని చిరంజీవి వేసిన సినీపెద్దల కమిటీ తేల్చిందని తెలిపారు. అప్పుడు వచ్చిన నిధులతోనే ఇప్పుడు ‘మా’’ సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారని శివాజీరాజా తెలిపారు.

ఇది కూడా చదవండి: ఫ‌స‌ల్ బీమాతో లాభం లేదు: కేంద్రంపై కేసీఆర్ ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement