Thursday, April 25, 2024

ఢిల్లీకి చేరిన ఎమ్మెల్యే దుర్గం వివాదం – జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద శేజ‌ల్ నిర‌స‌న

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్​డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ డెయిరీ సీఈవో ఆదినారాయణ, సీఏవో శేజల్​ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా ఫ్లెక్సీని ప్రదర్శించారు. తనపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేసినట్లు శేజల్‌ తెలిపారు. దుర్గం చిన్నయ్య వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్లంతా రోడ్డున పడ్డారని బాధితురాలు శేజల్ ఆరోపించారు.


బెల్లంపల్లి ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని అంబేద్కర్ విగ్రహాన్ని వినతి పత్రం అందజేశారు. తాము బెయిల్‌పై బయటకు వచ్చినా బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని శేజల్ పేర్కొన్నారు. దీనిపై జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. తొలుత ఆయనను తమ కంపెనీ బ్రాంచ్ ఓపెనింగ్‌కి పిలిచామన్నారు. అయితే తమ కంపెనీలో షేర్ అడిగారని , అలా అయితేనే ఇక్కడ బ్రాంచ్ పెట్టేందుకు ఛాన్స్ ఇస్తానని అన్నారని శేజల్ ఆరోపించారు.


దీనికి తాము ఒప్పుకుని ఆయన బావమరిదికి షేర్ ఇచ్చామని ఆమె వెల్లడించారు. ఒక నెల తమతో బాగానే వున్నారని.. కానీ అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయని శేజల్ చెప్పారు. ఆయన కోరిక తీర్చాలంటూ మమ్మల్ని వేధించడం మొదలుపెట్టారని శేజల్ ఆరోపించారు. తనను పట్టించుకోకుంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తానని బెదిరించాడని శేజల్ తెలిపారు. ఓ రోజున దళిత బంధు గురించి మాట్లాడుకుందామని పిలిపించి ఆ పథకంలో తనకు వాటా కావాలని, తాను చెప్పిన వారి పేర్లే పెట్టాలని డిమాండ్ చేశారని ఆమె చెప్పారు. దీనికి తాము నో చెప్పడంతో ఎమ్మెల్యే తమపై తప్పుడు కేసులు పెట్టించి మమ్మల్ని రిమాండ్‌కు పంపించారని శేజల్ తెలిపారు. బయటకు వచ్చాక కూడా తమకు వేధింపులు ఆగడం లేదన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement