Thursday, March 28, 2024

ఏపీలో ‘పరిషత్’ పోరు!

ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. పరిషత్ పోరుకు నగారా మోగింది. ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన రోజే నీలం సాహ్నీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 10న ఫలితాలు విడుదల చేస్తారు. ఈనెల 9న అవసరమైన చోట్ల రీపోలింగ్‌ నిర్వహిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా.. ఎన్నికల నిర్వహణ కోసం.. 33,663 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. 2 కోట్ల 82 లక్షల 15 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గత ఏడాది 660 జడ్పీటీసీలకు గాను 652 స్థానాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందులో.. 126 జడ్పీటీసీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 526 స్థానాలకు 8న ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. విభజన, కోర్టు కేసుల వల్ల 354 స్థానాల్లో ప్రక్రియ జరగడం లేదు. 2,371 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 7,322 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ ఎన్నికల బరిలో 19,002 మంది అభ్యర్థులు నిలిచారు.

గత ఏడాది మార్చి 7న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత.. కరోనా వ్యాప్తి దృష్ట్యా గతంలో ఎన్నికలను ఎస్‌ఈసీ వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి తగ్గాక.. ప్రక్రియ ఆగినచోట నుంచి మళ్లీ ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో.. ప్రక్రియ నిలిచిన చోటు నుంచే తిరిగి ప్రారంభిస్తున్నట్టు తెలిపిన ఎస్‌ఈసీ.. ఏకగ్రీవాలు మినహా మిగిలిన చోట్ల జరగనున్న ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది.

ఈ నెల 10వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. కోర్టు పరిధిలో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు ఉండబోవని ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారని ఆశించిన విపక్షాలకు ఈ నిర్ణయం నిరాశ కలిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement