Saturday, April 13, 2024

కడప ఎస్పీకి లేఖ రాసిన వివేకా కుమార్తె

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సీబీఐ దూకుడుగా ముందుకెళ్తోంది. దీంతో రోజుకొక కొత్త పేరు బయటకు వస్తోంది. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సైతం సీబీఐ అధికారులు కనిపెట్టడంతో.. కేసు ఓ కొలిక్కి వచ్చిందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఇందుకు రెక్కీ కూడా నిర్వహించారంటూ కడప ఎస్పీకి వైఎస్ వివేకా కుమార్తె సునీత లేఖ రాశారు.

ఈ మేరకు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప ఎస్పీని సునీత కోరారు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5:20 గంటల సమయంలో ఓ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తర్వాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌ చేశాడని లేఖలో సునీత వెల్లడించారు. వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితుడు శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. చివరకు ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని సునీత తెలిపారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత వెల్లడించారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని కోరారు. అయితే వివేకా హత్య కేసులో శుక్రవారం నాడు సీబీఐ విచారణకు శివశంకర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ వార్త కూడా చదవండి: వైసీపీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం.. సొంత ఖర్చుతో ఆనందయ్య మందు పంపిణీ

Advertisement

తాజా వార్తలు

Advertisement