Thursday, April 25, 2024

ఎస్టీలు, గొర్రెకాపరుల భూముల జోలికొస్తే ఊరుకోం: వైఎస్ షర్మిల వార్నింగ్

ప్ర‌జాప్ర‌స్థానంలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల 35వ రోజు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ఆత్మ‌కూరు మండ‌లం పారుప‌ల్లి గ్రామంలో పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎర్ర‌బోళ్ల భూముల అన్యాక్రాంతంపై వైయస్ షర్మిల గారు స్పందించారు. గ్రామంలోని సర్వే నెంబర్ 279లో సుమారుగా 127ఎకరాల భూమి ఉందని, ఎన్నో ఏండ్లుగా ఆ భూముల్లో గిరిజనులు, గొర్రెకురుమలు బర్లు, గొర్లు కాచుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఆ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా మైనింగ్ కు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో వైయస్ఆర్ ఆ భూములు కబ్జాకు గురికాకుండా, అటవీశాఖ స్వాధీనం చేసుకోకుండా కాపాడి, పేదల కోసం కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆ భూముల్ని ప్రైవేటు మైనింగ్ కు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని అవసరం అయితే నిరాహార దీక్ష కూడా చేస్తానని పేర్కొన్నారు.

పేదలకు మూడెకరాలు ఇస్తానని చెప్పి, ఉన్న భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ప్రజల మేలు కోసం ఒక్క పని కూడా చేయలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పోడు పట్టాలు, రుణ‌మాఫీ మాట‌ల‌కే ప‌రిమితం అయింద‌న్నారు. రైతుబంధు ఎక‌రాకు రూ.5వేలు ఇస్తే ఎలా స‌రిపోతాయ‌ని ప్ర‌శ్నించారు. ఎక‌రాకు రూ.5 వేలు ఇస్తూ రూ.25వేల విలువైన ప‌థ‌కాల‌ను కేసీఆర్ బంద్ పెట్టిండ‌న్నారు. ఎరువుల మీద స‌బ్సిడీ, పంట న‌ష్ట‌పోతే ప‌రిహారం, ఇన్ పుట్ స‌బ్సిడీ, రాయితీపై విత్త‌నాలు, యంత్ర ల‌క్ష్మి వంటి ప‌థ‌కాల‌ను కేసీఆర్ అట‌కెక్కించాడ‌న్నారు. ఇంట్లో ఇద్ద‌రు అర్హులుంటే ఒక్క‌రికే పెన్ష‌న్ ఇచ్చి, మరొకరికి అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేసినా ఓట్ల కోస‌మేనని, ఎన్నిక‌లు వ‌స్తేనే కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌స్తాడని విమర్శించారు. కేసీఆర్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement