Wednesday, April 24, 2024

Flash: మహాశివరాత్రి నాడే విషాదం.. గోదావరిలో యువకుడు గల్లంతు

మహా శివరాత్రి సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్ళి ఓ యువకుడు గల్లంతైన సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్ సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గల్లంతు అయిన యువకుడు భూక్య సాయి ( 20 )గా బంధువులు తెలిపారు.

కమలాపురం టీడీపీ కాలనీకి చెందిన భూక్య సాయి తమ బంధువులు, చట్టుప్రక్కల ఇండ్ల వారితో కలిసి మంగళవారం ఉదయం గోదావరి స్నానం చేయడం కోసం గోదావరికి వెళ్ళారు. గోదావరిలో స్నానం చేస్తుండగా భూక్య సాయి, భూక్య తరుణ్ అనే ఇద్దరు యువకులు గోదావరి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా అక్కడ ఉన్నవారు గమనించి ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భూక్య తరుణ్ ను గోదావరి లోపలి నుండి బయటకు తీసి ప్రాణాలతో కాపాడారు. భూక్య సాయి గోదావరిలో మునిగిపోవడంతో ఆచూకీ లభించ లేదు. దీంతో గోదావరిలో గల్లంతయిన భూక్య సాయి ఆచూకీ కోసం భూక్య సాయి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, మహా శివరాత్రి పండుగ నాడు ఈ దుర్ఘటన జరగడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement