Friday, March 29, 2024

Breaking | రంగారెడ్డి జిల్లాలో యువ‌తి కిడ్నాప్‌.. 100 మందితో వచ్చి రచ్చ రచ్చ..

రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. దాదాపు 100 మందితో వచ్చి సినీ ఫక్కీలో ఆ యువతిని ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న ఇవ్వాల సాయంత్రం జ‌రిగింది. ముచ్చర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపతుల కుమార్తె ముచ్చర్ల వైశాలి. 24 ఏళ్ల వైశాలి డెంటల్ డాక్టర్‌గా ప‌నిచేస్తోంది. వీరు తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి, మన్నెగూడ సిరి టౌన్ షిప్ లో ఉంటున్నారు. అయితే, నవీన్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద ఎత్తున యువకులను వెంటేసుకుని వచ్చి వైశాలిని కిడ్నాప్ చేసిన‌ట్టు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో అక్కడికి వ‌చ్చిన వారు ఇంట్లో విధ్వంసం సృష్టించారు. ఇంట్లోని ఫర్నిచర్ , వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డొచ్చినవారిపై దాడికి పాల్పడ్డారు. నవీన్ రెడ్డి ఓ టీ రెస్టారెంట్ ఓనర్ అని తెలుస్తోంది. గతంలో నవీన్ రెడ్డి, వైశాలి ప్రేమించుకున్నార‌ని, వైశాలిని పెళ్లి చేసుకుంటానని నవీన్ రెడ్డి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేద‌ని స‌మాచారం. ఈ నేపథ్యంలోనే వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసినట్టు భావిస్తున్నారు.

కాగా, వైశాలికి ఈ మ‌ధ్య‌నే మరో యువకుడితో నిశ్చితార్థం జరిగిన‌ట్టు తెలుస్తోంది. మరికొన్నిరోజుల్లో పెళ్లి జరగనుండగా, ఈ కిడ్నాప్ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. వైశాలిని కాపాడాల‌ని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సాగర్ రోడ్డుకు ఇరువైపులా బైఠాయించి ఆందోళ‌న చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement