Saturday, April 20, 2024

రోడ్ స్వీపింగ్ మేషీన్స్ తో.. మనీ స్వీపింగ్.. ఎక్కడంటే..

ప్ర‌భ‌న్యూస్: రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) తీసుకొచ్చిన వ్యాక్యూమ్‌ స్వీపింగ్‌ మిషన్‌ వాహనాలు దుమ్ముకు బదులుగా డబ్బుల్ని మింగేస్తు న్నాయి. జీహెచ్‌ఎంసీ పౌర సంస్థ నగరంలోని ఐదు జోన్లలో 26 స్వీపింగ్‌ మిషన్‌ వాహనాల ద్వారా రోడ్లను శుభ్రం చేస్తుంది. కానీ.. వాహనాల కాంట్రాక్టు తీసుకున్న ప్రైవేటు ఏజెన్సీలు మాత్రం పనులు చేయకుండాలనే బిల్లులను దండుకుంటున్నాయనే విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి.

గ్రేటర్‌ పరిధిలో మొత్తం రెండు వేలకు పైగా ఉన్న రహదారులను శుభ్రపరిచేందుకు 26 స్వీపింగ్‌ మిషన్‌ వాహనాల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలు కాంట్రాక్టుల ద్వారా నిర్వహిస్తున్నాయి. కానీ.. ఈ వాహనాలు రహదారికి మధ్యలో డివైడర్‌ను ఆనుకొని ఉన్న మొదటి లేన్‌ను మాత్రమే శుభ్రం చేసి మిగిలిన రోడ్డంతా గాలికి వదిలేస్తున్నాయి. దాంతో రోడ్లపై దుమ్ము అదేవిధంగా ఉంటోంది. వాహనాలకు జీపీఎస్‌ పరికరాలను అమర్చి, ఆ ప్రాంతంలో కేవలం సింగిల్‌ లేన్‌ను మాత్రమే శుభ్రపరిచి, రోడ్డంతా శుభ్రపరిచినట్లు చూపిస్తున్నాయి. అంటే, నాలుగు లేన్లు ఉన్న రోడ్డుపై ఒక కిలోమీటరు శుభ్రంచేస్తే దాన్ని నాలుగు కి.మీలుగా లెక్కల్లో చూపిస్తున్నాయి. స్వీపింగ్‌ మిషన్ల నిర్వహణను పర్యవేక్షిస్తున్న పౌర సరఫరాల అధికారలు ఈ విశయాలు తెలిసి కూడా మౌనం వహిస్తున్నారని అభియోగాలు వ్యక్తమవుతున్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఐదు జోన్లలో స్వీపింగ్‌ కోసం ప్రస్తుతం ఉన్న వాహనాలకు తోడుగా మరో 18 కాంపాక్ట్‌ హెవీ డ్యూటీ వ్యాక్యూమ్‌ స్వీపర్లను వినియాగించాలని బల్దియా నిర్ణయించింది. ప్రధాన రహదారులపై దుమ్మును తొలగించడంతో పాటు గాలి నాణ్యతను మెరుగు పరిచేందుకు ఏటా రూ.32 కోట్లతో ఈ హెవీ డ్యూటీ వ్యాక్యూమ్‌ స్వీపర్లను తీసుకురావాలని జీహెచ్‌ఎంసీ పౌర సంఘం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న స్వీపింగ్‌ యంత్రాలను తనిఖీ చేసిన అధికారులు వాటి పని తీరును పరిశీలించారు.

ఇందులో భాగంగా, స్వీపింగ్‌ వాహన యంత్రాల చీపుర్ల నాణ్యతను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఏఎంఓహెచ్‌)లు 18 స్వీపింగ్‌ మిషన్లు నాసిరకంగా ఉన్నట్లు తేల్చారు. కండీషన్‌లో లేని వాహనాల వాడకంపై ప్రైవేటు కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపధ్యంలో జీహెచ్‌ఎంసీ మరో 18 స్వైపింగ్‌ మిషన్లను (ఫ్యాకేజీ) తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. మొదటి సంత్సరం పాటు సింగిల్‌ ఇంజన్‌ (స్వీయ ఛోదక యంత్రాలు)తో సక్షన్‌ పరిజ్ఞానం కలిగిన స్వీపర్‌ యంత్రాలను తీసుకొవాలనుకుంటుంది.

ఏడాది కాలంలో నగరం లోని ఐదు జోన్లలో వాటి పనితనం, సామర్థ్యాల ఆధారంగా మరో రెండేళ్లకు కొనసాగించేందుకు అవకాశం ఉంది. మొత్తం 18 ప్యాకేజీల్లో ఖైరతాబాద్‌లో 5, ఎల్‌బి నగర్‌లో 4, సికింద్రబాద్‌లో 4, శేర్లింగంపల్లిలో 3, కూకట్లపల్లిలో 2గా విభజించనున్నారు. ఒక్కో ప్యాకేజీ కాంట్రాక్టు విలువ రూ.1,14,46,400 ఉండనుంది. ఈ మొత్తం ప్యాకేజీకి జీహెచ్‌ఎంసీకి ఏడాదికి రూ.32 కోట్లకు పైగా ఖర్చు అవనుంది. కాగా, ఇకనైనా అధికారులు కఠినంగా వ్యవహరించి నిధులు దుర్వినియోగం కాకుండా ప్రైవేట్‌ ఏజెన్సీలను నియంత్రించాలనే వాదనలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement