Saturday, April 20, 2024

ఎక్కువ సేపు పనిచేస్తున్నారా? అయితే మీ ప్రాణానికే ప్రమాదం

ఎక్కువ గంటలు పనిచేస్తే ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఎక్కువ పని గంటల వల్ల ఏటా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారని వెల్లడించింది. కరోనా సమయంలో అది మరింత ముదిరే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా దీనిపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో)తో కలిసి చేసిన అధ్యయన నివేదికను WHO విడుదల చేసింది.

194 దేశాలపై చేసిన అధ్యయనంలో 55 కన్నా ఎక్కువ గంటలు పనిచేస్తున్న వారిలో గుండెపోటుతో మరణించే ముప్పు 35 శాతం ఎక్కువని తేల్చారు. హృదయ సంబంధ వ్యాధులతో చనిపోయే ముప్పు 17 శాతం అధికమని గుర్తించారు. 35 నుంచి 40 గంటల వరకు పనిచేసే వారితో పోలిస్తే ఎక్కువ గంటలు పనిచేసే వారికి ముప్పు ఎక్కువని తేల్చారు. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల గుండెపోటు, ఇతర గుండె జబ్బుల సమస్యలతో 2016లో 7.45 లక్షల మంది చనిపోయినట్టు పేర్కొంది. 2000వ సంవత్సరం నుంచి పోలిస్తే అది 30 శాతం ఎక్కువైందని వెల్లడించింది. వారానికి 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ పనిచేస్తే ఆరోగ్యానికి పెనుముప్పు తప్పదని WHOపర్యావరణ విభాగం డైరెక్టర్ మరియానీరా హెచ్చరించారు.

ఎక్కువసేపు పనిచేసి చనిపోతున్నవారిలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారని, పనిగంటల వల్ల 72శాతం మంది పురుషులు మరణిస్తున్నారని నీరా ఆవేదన వ్యక్తం చేశారు. అందులోనూ ఎక్కువ మంది మధ్య వయస్కుల వారేనన్నారు. ఆగ్నేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలే ఎక్కువగా బాధితులవుతున్నారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement