Saturday, April 20, 2024

బండి సంజయ్ ని చూస్తుంటే వెంకయ్య నాయుడు గుర్తొస్తున్నారు.. ప్ర‌ధాని మోడీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజ‌య్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. బండి సంజయ్ ని చూస్తుంటే తనకు వెంకయ్య నాయుడు గుర్తొస్తున్నారని, ఆయన అద్భుతంగా మాట్లాడతారని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలి రోజున.. రాష్ట్రంలో పార్టీ పనితీరు, ప్రజాసంగ్రామ యాత్రపై బండి సంజయ్ నివేదిక సమర్పించారు. మోడీ కల్పించుకుని ప్రజాసంగ్రామ యాత్ర గురించి చెప్పాలని సంజయ్‌కు సూచించారు. దీంతో హిందీలో మాట్లాడడం ప్రారంభించిన సంజయ్.. కాసేపటి తర్వాత ప్రసంగం ఆపి హిందీలో తాను పూర్తిస్థాయిలో చెప్పలేకపోతున్నానని అన్నారు. స్పందించిన ప్రధాని భావోద్వేగాలను చెప్పేందుకు మాతృభాషను మించినది లేదని, అందులో చెప్పాలని సూచించారు.

దీంతో సంజయ్ యాత్రా విశేషాలను తెలుగులోనే వివరించారు. ఆయన ప్రసంగం ముగించిన వెంటనే కార్యవర్గ సభ్యులు కరతాళ ధ్వనులతో అభినందించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీ అభివృద్ధికి సంజయ్ ఎంతగానో కష్టడపడుతున్నారని ప్రశంసించారు. ఎంతో గొప్పగా యాత్ర చేసిన సంజయ్ తన గురించి తాను చెప్పుకోలేకపోతున్నారని, ఆయన యాత్రలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ ఆ విషయాలను హిందీలో వివరించాలని కోరారు. దీంతో సంజయ్ తెలుగులో చెప్పిన విషయాలను తరుణ్ చుగ్ హిందీలో వివరించారు. ఆ తర్వాత మోడీ మరోమారు మాట్లాడుతూ.. బండి సంజయ్ యాత్ర చేపట్టిన ప్రాంతాలను ఇతర రాష్ట్రాల నేతలు సందర్శించి యాత్రపై అధ్యయనం చేయాలని సూచించారు. భవిష్యత్తులో సంజయ్ చేపట్టే యాత్రకు ఇతర రాష్ట్రాల నుంచి యువమోర్చా నేతలను పంపిస్తే మార్గదర్శకంగా ఉంటుందని చెబుతూ బండి సంజయ్ భుజం తట్టి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement