Wednesday, March 27, 2024

ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి కారణ‌మ‌దే.. ఎంక్వైరీలో తేలిన సంచలన వాస్తవాలు

గత డిసెంబ‌ర్ 8వ తేదీన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్ర‌యాణిస్తున్న‌ హెలికాప్ట‌ర్‌ ప్ర‌మాదానికి గుర‌యిన‌ విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌తో పాటు మ‌రో 13 మంది చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌ యావ‌త్తు దేశాన్ని క‌లిచివేసింది. కాగా, దీనిపై అప్పుడు అనేక అనుమానాలు వచ్చాయి. ఈ త‌రుణంలో ఎలాంటి వదంతులు ప్ర‌చారం చేయొద్ద‌ని ఆర్మీ కూడా కోరింది. ఈ ఘటనపై భారత వైమానిక దళం ఉన్న‌త స్థాయి దర్యాప్తు చేప‌ట్టింది. దీనిపై ట్రై-సర్వీసెస్ కోర్ట్ ద‌ర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తు నివేదికను ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరికి సమర్పించింది. కాగా, నివేదికలో సంచ‌న‌ల విష‌యాలు వెలుగులోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ సారథ్యంలో సాగుతున్న కోర్టు ఎంక్వైరీ.. సంచ‌ల‌న వాస్త‌వాలను బ‌య‌ట‌పెట్టింది. ప్రతికూల వాతావరణం కారణంగా జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తున్న‌ హెలికాప్టర్ దారి తప్పింద‌ని వివరించింది. దీంతో ఆ విమానం ప్ర‌తికూల‌ ప్రాంతానికి దూసుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నామ‌ని నివేదిక పేర్కొంది. Mi-17 V5 హెలికాప్ట‌ర్‌ ప్ర‌మాదానికి ఎలాంటి సాంకేతిక పొరపాట్లు, మెకానికల్ లోపాలేవ‌ని ఫైన‌ల్‌ రిపోర్టు తేల్చి చెప్పింది. వాతావరణంలో ఊహించని మార్పు వ‌ల్ల‌నే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెల్చింది. అలాగే.. ఈ ప్ర‌మాదానికి ఎలాంటి నిర్లక్ష్యం లేద‌ని తోసిపుచ్చింది.

ప్రాథమిక ద‌ర్యాప్తు ప్రకారం.. లోయలో వాతావరణ పరిస్థితుల్లో ఊహించని మార్పు కారణంగా మేఘాలు హెలికాప్ట‌ర్‌కి అడ్డు రావ‌డంతో ప్రమాదం జరిగింది. ఈ ఘ‌ట‌న‌తో పైలట్ అయోమయానికి గుర‌య్యార‌ని, త‌త్ఫ‌లితంగా ఫైల‌ట్ నియంత్రిత కొల్పోయార‌ని నివేదిక తెలిపింది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ల‌ను క్షుణంగా విశ్లేషించి ఈ నివేదికను త‌యారు చేసిన‌ట్టు విచారణ బృందం పేర్కొంది. అంతేకాకుండా ప్రమాదాన్ని చూసిన ప్ర‌త్యేక్ష‌ సాక్షులందరినీ ప్రశ్నించిన‌ట్టు తెలిపింది. ఈ ఫ‌లితాల‌ను అన్నింటిని క్రోడీకరించిన పిమ్మ‌ట ఈ నివేదిక‌ను వెల్ల‌డించిన‌ట్లు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement