Thursday, April 25, 2024

30శాతం ఫీజు పెంచుకుంటాం.. పర్మిషన్​ ఇయ్యాలే: విద్యాశాఖను కోరిన ప్రైవేట్​ విద్యా సంస్థలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే విద్యా సంవత్సరం ఫీజులను 30 శాతం పెంచేందుకు అనుమతించాలని విద్యాశాఖను తెలంగాణ ప్రయివేటు విద్యా సంస్థలు కోరాయి. ఈ మేరకు అధికారులతో ప్రైవేట్‌ విద్యా సంస్థల నాయకులు శుక్రవారం చర్చించారు. హైదరాబాదులోని ఎర్రమంజిల్‌ లోని స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫీస్‌ లో చర్చలు జరిగాయి. విద్యాశాఖ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ దేవసేన, అడిషనల్‌ డైరెక్టర్‌ లింగయ్యతో ప్రయివేటు విద్యా సంస్థ ల ప్రతినిధులు చర్చించారు. ఫీ రెగ్యులేటరీ కమిటీ గా ఏర్పాటైన తిరుపతిరావు కమిటీ సూచనలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరారు.

కరోనా సెలవుల కారణంగా రెండు సంవత్సరాలుగా విద్యా సంస్థలను మూసి ఉంచటంతోపాటు ఈ ఏడాది ఫీజులు పెంచ నందున , ఇప్పుడే గాడిలో పడుతున్న ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అనువుగా రెండు సంవత్సరాల పాటు చట్టాలు , కమిటీలు అంటూ ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. ఈ సమావేశంలో విద్యాసంస్థల ప్రతినిధులుగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌ రావు, రాష్ట్ర కోశాధికారి ఐ వి రమణ రావు, సలహాదారులు డాక్టర్‌ ప్రసాదరావు, పరంజ్యోతి, సభ్యులు పి రమణ రావు, ఏ శ్రీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. అలాగే క్యాథలిక్‌ అసోసియేషన్‌ నుండి శౌరెడ్డి, మైనార్టీ సంస్థ నుండి అక్తర్‌ షరీఫ్‌, ఇస్మా నుండి ప్రవీణ్‌ రాజు , చౌదరి, ఇంటర్నేషనల్‌ సంస్థల నుండి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement