Thursday, April 25, 2024

వరంగల్ లో నియో మెట్రో.. ప్రత్యేక ఏంటో తెలుసా?

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో నియో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. వరంగల్ మెట్రో రైలు ఆకాశ, భూ మార్గంలో పయనించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్(మహా మెట్రో) సిద్ధం చేసింది. 

వరంగల్‌ నుంచి హన్మకొండ మీదుగా కాజీపేట వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే నియో మెట్రోకు రూ. 1000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. నియో విధానంలో మెట్రోను నిర్మించడం ద్వారా దాదాపు 2 వేల కోట్ల వరకు ఆదా అవుతుందని మహా మెట్రో పేర్కొంది. మెట్రో ఏడు కిలోమీటర్ల మేర భూ మార్గంలో, 8 కిలోమీటర్ల మేర ఆకాశ మార్గంలో నడుస్తుంది. ఈ మేరకు కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ తెలంగాణ ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపింది. త్వరలోనే దీనిని కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నట్టు మహా మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజేష్ దీక్షిత్ తెలిపారు.

వరంగల్ మెట్రోకు నాసిక్ నియో మెట్రో రైలు ప్రాజెక్ట్ తరహాలో డీపీఆర్‌ను రూపొందించారు. సాధారణ విధానంలో కిలోమీటరు మార్గం నిర్మించేందుకు రూ. 180 కోట్లు ఖర్చవుతుంది. అయితే, మహామెట్రో రూపొందించిన తాజా డీపీఆర్‌తో ఇది రూ. 60 కోట్లకు తగ్గుతుందని భావిస్తున్నారు.  ప్రస్తుతం వరంగల్ జనాభా పది లక్షలు కాగా.. 20 ఏళ్ల తర్వాత అంటే 2041 నాటికి వరంగల్ జనాభా 30 లక్షలకు చేరుతుందని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఈ డీపీఆర్‌ను తీర్చిదిద్దారు.

హైదరాబాద్ మెట్రోకు నియో మెట్రో సాంకేతికత పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ రైలు రబ్బరు టైర్లపై నడుస్తుంది. వరంగల్ రోడ్లు దీనికి అతికినట్టు సరిపోతాయని మహా మెట్రో పేర్కొంది. ఆటోమెటిక్ టికెటింగ్ విధానంతో నిర్వహణ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. సాధారణ మెట్రో నిర్వహణ కోసం కిలోమీటరుకు 35 మంది సిబ్బంది అవసరం కాగా, నియో విధానంలో 15 మంది సరిపోతారని మహా మెట్రో పేర్కొంది.

ఇది కూడా చదవండి: సీఎం జగన్ కేసులపై విచారణ వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement