Thursday, April 18, 2024

‘భారీ బడ్జెట్‌ డొల్లతనం’.. ఆదాయంలో మూడో వంతు కూడా రాలే

సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ స‌ర్కార్ భారీ బడ్జెట్‌ డొల్లతనం మరోసారి బయటపడిందని ఆమె అన్నారు. అంచనా వేసిన ఆదాయంలో మూడో వంతు కూడా రాలేదని, ఏకంగా రూ.50 వేల కోట్ల వరకూ ఆదాయం పడిపోయిందన్నారు. ఫలితంగా, బడ్జెట్‌లో అంచనా వేసినప్పటికీ… దాదాపు రూ.32 వేల కోట్ల మేరకు ఖర్చు చేయలేని పరిస్థితి అని పేర్కొన్నారు. వెరసి, బడ్జెట్లో కేసీఆర్ స‌ర్కార్ అంకెల గారడీ చేసింద‌ని కాగ్‌కు సమర్పించిన నివేదిక ద్వారా మ‌రోసారి బట్టబయలైందన్నారు. ఏటా ఆకర్షణీయమైన అంకెలతో భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టడం… చివరికి ఆదాయం రాలేదంటూ లోటును చూపించడం టీఆర్ఎస్ సర్కారుకి పరిపాటిగా మారిపోయిందని ఆరోపించారు. గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి అని అన్నారు.

మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడుల కింద 72.37 శాతం నిధులే సమకూరాయిని చెప్పారు. భూముల అమ్మకం తదితర పన్నేతర రాబడుల కింద రూ.30,557.35 కోట్లు వస్తాయని బడ్జెట్లో కేసీఆర్ ప్ర‌భుత్వం అంచనా వేసిందన్నారు. కానీ, రూ.8,857.37 కోట్లు… అంటే 28.99 శాతం మాత్రమే సమకూరాయని చెప్పారు. పన్నేతర రాబడుల కింద భారీగా చూపించడం… అందులో నాలుగో వంతు కూడా రాకపోవడం ఏటా జరుగుతున్న తంతే! అయినా, బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచడానికి ఇదొక సాకుగా మారింది. భారీ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని చెప్పుకోవ‌డానికి ప్ర‌తి ఏటా కేసీఆర్ స‌ర్కార్ ఇలానే చేస్తుందని విమర్శించారు. ప్ర‌తి సంవ‌త్స‌రం భారీ బ‌డ్జెట్ ప్ర‌వేశపెట్టడం… అది కాస్తా లోటు బ‌డ్జెట్‌గా మార‌డం చూస్తుంటే… కేసీఆర్ సర్కారుకు బడ్జెట్ అనేది ఒక తంతుగా కనిపిస్తోంది తప్ప ఇది రాష్ట్రాభివృద్ధికి కీలకం అనే సోయి లేకుండా పోయిందని చెప్పారు. దీని వల్ల అనేక ప్ర‌జాసంక్షేమ‌ పథకాల‌కు దెబ్బ ప‌డుతోందన్నారు. కేసీఆర్ ఇకనైనా అంకెల గార‌డీని పక్కన పెట్టి వాస్తవ దృష్టితో చూడాలన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆడుతున్న ఈ అంకెల గార‌డీకి తెలంగాణ ప్ర‌జలు త‌గిన జవాబు చెబుతారని విజయశాంతి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement