Tuesday, April 23, 2024

ప్రభుత్వాల కనీస బాధ్యత.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి!

కరోనాను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలని.. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం కనీస ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. కరోనాతో చికిత్స పొందుతున్న ఉత్తమ్ ఆసుపత్రి నుంచి వీడియో సందేశం పంపించారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియాజేశారు. అందరి దీవెనలతో రెండు మూడు రోజులలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని తెలిపారు. పేద ప్రజలు కరోనా బారిన పడి వైద్య సేవలు అందాక నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెడ్లు, రెమిడిసివర్ ఇంజక్షన్లు దొరక్కపోవడం అత్యంత బాధాకరమన్నారు. హాస్పిటల్స్‌ లో బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్, రెమిడిసివర్ ఇంజెక్టన్లు ఇప్పించాలని తమకు ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. కరోనా బాధితుల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు గాంధీ భవన్‌ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సేవలు చేస్తున్నారన్నారు. వారందరినీ అభినందనలు తెలియజేశారు. కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని ఉత్తమ్ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement