Saturday, April 20, 2024

వీడి దుంపతెగ.. పెళ్లాం కొట్టిందని, ఏకంగా కొబ్బరి చెట్టుపైనే మకాం పెట్టాడు!

‘‘పెళ్లాం కొడుతోంది బాబోయ్’’​ అంటే ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ భూమ్మీదనే ఉండనని ఓ వ్యక్తి తన ఆలోచనకు పదునుపెట్టాడు. భార్యమీద విసుగు చెందిన అతను ఇంట్లో ఉండకుండా 80 అడుగుల పొడవాటి కొబ్బరి చెట్టు ఎక్కి అక్కడే మకాం పెట్టాడు. ఇట్లా ఒకటి, రెండ్రోజులు కాదు.. దాదాపు నెల  రోజుల నుంచి చెట్టుమీదనే జీవిస్తున్నాడు. ఈ విషయం ఆ నోట ఈనోట చుట్టుపక్కల ఊళ్లకు తెలిసి అతన్ని చూడ్డానికి క్యూకట్టారు. అయితే.. అతను చెట్టుమీద ఉండడం తమకేమీ ప్రాబ్లమ్​ లేదు కానీ, తమ ఆడోళ్లు ఇబ్బందిపడుతున్నారు. ప్రైవసీకి ఇబ్బందిగా మారిందని చుట్టుపక్కల ఇళ్లవాళ్లు పోలీసులకు కంప్లెయింట్​ చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్​ రాష్ట్రంలో జరిగింది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

భార్యతో చీటికిమాటికి గొడవలు, దాడులతో విసిగిపోయిన ఓ వ్యక్తి నెల రోజులుగా 80 అడుగుల ఎత్తున్న కొబ్బరి చెట్టుపై జీవిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా కోపగంజ్ ప్రాంతంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. 42 ఏళ్ల రామ్ ప్రవేశ్ తన భార్యతో ఆరు నెలలుగా గొడవ పడుతున్నాడు. తన భార్య తనను కొట్టిందని కూడా ఆరోపించాడు. భార్య తీరుతో మనస్తాపం చెందిన అతను ఇంటి దగ్గరున్న కొబ్బరి చెట్టుపైకి ఎక్కి నెల రోజులుగా జీవిస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులు ఆహారం, నీరు తాడుతో కట్టి చెట్టు దగ్గర వేలాడదీస్తారు. అతను పై నుండి తాడును లాక్కొని వాటిని తీసుకుంటున్నాడు.

కాగా, గ్రామస్థుల కథనం ప్రకారం.. రామ్ ప్రవేశ్ రాత్రిపూట చెట్టుపై నుండి దిగి, మలవిసర్జన చేసి తిరిగి చెట్టుపైకి ఎక్కేస్తున్నడు. వారు రామ్ ప్రవేశ్‌ను కిందకు రమ్మని కోరినప్పటికీ అతను ఒప్పుకోవడం లేదు. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు కిందికి దిగి రావాలని రిక్వెస్ట్​ చేసినా రామ్ ప్రవేశ్ వినకపోవడంతో పోలీసులు కూడా విసిగిపోయారు. అతడిని వీడియో తీసుకుని వెళ్లిపోయారు.

అయితే.. గ్రామపెద్ద దీపక్‌కుమార్‌ మాత్రం ఈ సమస్య తమ గ్రామానికి కాస్త ఇబ్బందిగా మారిందని చెబుతున్నాడు.. కొబ్బరి ట్టుకు ఆనుకుని చాలా ఇళ్లు ఉన్నాయని, అతను ఆ చెట్టుపై ఉండడం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వారి ఇళ్లలో ఏమి చేస్తున్నారో అతను చూస్తూనే ఉంటాడని, అది వారి ప్రైవసీని ప్రభావితం చేస్తుందని తెలిపాడు. ఈ విషయమై గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఫిర్యాదు కూడా చేశారన్నాడు. కాగా, రామ్ ప్రవేశ్ తండ్రి శ్రీకిషున్ రామ్ మాట్లాడుతూ.. అతడిని చూసేందుకు రోజూ గ్రామ చుట్టుపక్కల ప్రజలు అక్కడికి వస్తుంటారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement