Thursday, April 25, 2024

దేశానికి రాజైనా అంబర్ పేట బిడ్డనేః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావోద్వేగం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. జన ఆశీర్వాద యాత్ర హైదరాబాదులోని అంబర్ పేటకు చేరుకున్న సందర్భంగా కిషన్ రెడ్డిలో భావోద్వేగాలు పెల్లుబికాయి. అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తర్వాత.. బిడ్డ తన తల్లి దగ్గరకు వచ్చినట్లుగా అనిపిస్తోందని ఆయన అన్నారు. దేశానికి రాజైనా తాను అంబర్ పేట బిడ్డనే అని అన్నారు. గతంలో ఇక్కడి ప్రజలు తన పట్ల చూపిన ఆదరణ తనను ముగ్ధుడ్ని చేసేదని చెప్పారు. తాను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నానంటే అంబర్‌పేట అసెంబ్లీ, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలే కారణమని కిషన్ రెడ్డి తెలిపారు.

 

“నాడు నేను బస్తీలు తిరిగేటప్పుడు ఇక్కడి అమ్మలు, చెల్లెమ్మలు నన్ను సాదరంగా స్వాగతించేవాళ్లు. ఇప్పుడా ఆనందంలేదు. ఇప్పుడు నన్ను కలిసేందుకు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు కార్లలో వస్తుంటారు. కానీ, అంబర్ పేటలో ఉండే ఆనందం మాత్రం నాకు రాదు. అయితే, ఇవాళ నాకు దేశానికి సేవ చేసే అవకాశం వచ్చింది. అందుకు కారణం అంబర్ పేట, సికింద్రాబాద్ ప్రజలే. మీరు, నరేంద్ర మోదీ గారు ఇచ్చిన అవకాశంతోనే నేను ఢిల్లీ వరకు వెళ్లాను. అంబర్ పేట బిడ్డగా మీరు గర్వపడేలా పనిచేస్తా. మీకు మంచిపేరు తెచ్చేలా పనిచేస్తా. ఇవాళ నేను మూడు శాఖలకు కేంద్రమంత్రిగా ఉన్నాను. గతంలో అమిత్ షాకు నేను సహాయమంత్రిగా పనిచేశా. కానీ ప్రధాని నరేంద్ర మోదీ… నువ్వు సహాయకుడిగా కాదు, నీకే మూడు శాఖలు ఇస్తున్నాని నన్ను కేంద్రమంత్రిని చేశారు. ఒక సహాయమంత్రిగా ఉన్న నాకు ఇవాళ మోదీ గారు ఐదు సహాయ మంత్రులను ఇచ్చారు. దేశంలో అత్యధిక సహాయ మంత్రులను కలిగి ఉన్నది మీ అంబర్ పేట్ బిడ్డకే” అంటూ ఉద్వేగంతో ప్రసంగించారు.

కాగా, కిషన్ రెడ్డి గతంలో అంబర్ పేట నియోజకవర్గం నుంచి 2009, 2014లో గెలుపొందారు. అయితే 2018లో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన కేంద్రమంత్రి వర్గ విస్తరణలో కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ వచ్చింది.

ఇది కూడా చదవండిః కొంప ముంచిన బుల్లెట్ సాంగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement