Tuesday, April 23, 2024

రష్యాతో చర్చలకు సిద్ధం… కానీ బెలారస్ లో వద్దన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం కొనసాగిస్తోంది. గత మూడు రోజులుగా బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే, ఓవైపు దాడులు చేస్తూనే, మరోవైపు చర్చలకు రావాలని రష్యా ఆహ్వానం పలుకుతోంది. తమ ప్రతినిధి బృందాన్ని బెలారస్ పంపిస్తామని, ఉక్రెయిన్ బృందం కూడా బెలారస్ రావాలని రష్యా పేర్కొంది. అక్కడ ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. రష్యాతో చర్చలకు తాము అంగీకరిస్తున్నామని, అయితే చర్చలకు వేదికగా బెలారస్ తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా దురాక్రమణకు బెలారస్ ఎంతో సహకరిస్తోందని, అలాంటి చోట తాము చర్చలు జరపబోమని పేర్కొన్నారు. క్షిపణులు ఎగరని ఏ దేశంలోనైనా చర్చలకు తాను సిద్ధంగా ఉన్నాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. వార్సా, బ్రటిస్లావా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బాకు… ఈ ప్రాంతాల్లో ఎక్కడ చర్చలు జరిపినా తమకు సమ్మతమేనని చెప్పారు. ఉక్రెయిన్ కు వ్యతిరేకం కాని దేశాల్లోనే తాము చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. రష్యా దాడులు అత్యంత కిరాతకమని, సాధారణ పౌరుల ఆవాసాలను సైతం ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నట్టు ప్రకటించిన రష్యా అందుకు విరుద్ధంగా పౌర సముదాయాలపై బాంబుల వర్షం కురిపిస్తోందని జెలెన్ స్కీ మండిపడ్డారు.

అంతకుముందు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ, గోమెల్‌లో చర్చలకు రష్యా ఇప్పటికే సిద్ధంగా ఉందన్నారు. ఇప్పుడు మాస్కో ఉక్రేనియన్ల కోసం వేచి ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement