ఈమధ్య కాలంలో అపోలో హాస్పిటల్స్ కొ చైర్ పర్సన్, మెగాస్టార్ చిరంజీవి కోడలు అయిన కొణిదెల ఉపాసనకు దుబాయ్ సర్కారు గోల్డెన్ వీసా అందజేసింది. అదే విధంగా సినీ నటి అమలాపాల్ కు కూడా గోల్డెన్ వీసాని అందించింది యూఏఈ ప్రభుత్వం. అసలు గోల్డెన్ వీసా అంటే ఏమిటి.. అది ఎవరెవరికి ఇస్తారు. ఎందుకిస్తారు అనే ప్రశ్నలు చాలామందిని వేధిస్తుంటాయి. వాటికి ఆన్సర్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
వివిధ రంగాల్లో అంటే.. కళలు, క్రియేటివిటీ, పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద, చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ (దుబాయ్) ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు వీలు కలుగుతుంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తుందీ యూఏఈ ప్రభుత్వం. ఇందులో భాగంగా విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనానికి ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా అవకాశం కల్పిస్తోంది. అలాగే, 100 శాతం ఓనర్షిప్తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్టర్మ్ వీసాకు 10, 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుందన్నమాట.
ఈ గోల్డెన్ వీసాను తాజాగా టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన, సినీ నటి అమలా పాల్ అందుకున్నారు. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరాఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది.
ఈ వీసాను సాధించిన హీరోయిన్ త్రిష.. తొలి తమిళ కథానాయికగా ఉన్నారు. తర్వాత అమలా పాల్ను కూడా గోల్డెన్ వీసా వరించింది. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీ నుంచి మొదటగా మోహన్ లాల్ తర్వాత మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కూడా ఈ వీసాను పొందారు. స్పోర్ట్స్ కు చెందిన సానియా మీర్జా-షోయబ్ మాలిక్ దంపతులకు దుబాయ్ గోల్డెన్ వీసా దక్కింది. వీరే కాకుండా ఒడిశాకు చెందిన ఆర్టిస్ట్ మోనా విశ్వరూప మోహంతీకి కూడా ఈ దుబాయ్ గోల్డెన్ వీసా దక్కింది.