Thursday, April 25, 2024

TSPSC – తప్పు జరిగింది.. సరిదిద్దుతున్నాం.. కేటీఆర్

TSPSCలో తప్పు జరిగింది.. సరిదిద్దుతున్నామని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్‌కే భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… పేపర్ లీక్‌ అనేది ఇద్దరు వ్యక్తుల తప్పే కానీ.. సిస్టమ్ ఫెయిల్యూర్ కాదని, ఇద్దరు చేసిన తప్పుతో వ్యవస్థకు చెడ్డపేరు వచ్చిందన్నారు. నిరుద్యోగ యువ‌త ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారంతా మ‌ళ్లీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కావొచ్చ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప‌బ్లిక్ క‌మిష‌న్ ఏర్ప‌డిన త‌ర్వాత మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 37 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఎగ్జామ్‌పై కూడా ఆరోప‌ణ‌లు రాలేదు. కంప్యూట‌ర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 99 ప‌రీక్ష‌లు నిర్వ‌హించామన్నారు.

నాలుగున్న‌ర ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాశారు. పార‌ద‌ర్శ‌క‌త తీసుకురావాల‌ని అనేక చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం జ‌రిగిందన్నారు. యూపీఎస్సీ చైర్మ‌న్ రెండుసార్లు తెలంగాణ‌కు వ‌చ్చి టీఎస్‌పీఎస్సీని విజ‌ట్ చేసి అధ్య‌య‌నం చేశారన్నారు. దేశంలోని 13 రాష్ట్రాల ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ల చైర్మ‌న్లు కూడా మ‌న మార్పుల‌ను చేర్పుల‌ను అధ్య‌యనం చేసి వారి రాష్ట్రాల్లో అమ‌లు చేసేందుకు య‌త్నిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇద్ద‌రు వ్య‌క్తులు చేసిన త‌ప్పు వ‌ల్ల మొత్తం వ్య‌వ‌స్థ‌కే చెడ్డ‌పేరు వ‌చ్చింద‌న్నారు. ఇది జ‌ర‌గ‌కూడ‌ని ప‌ని. నివారించాల్సిందేనన్నారు. రాష్ట్ర యువ‌తలో భ‌రోసా నింపాల్సిన బాధ్య‌త మా మీద ఉంది.. క‌చ్చితంగా ప్ర‌వీణ్, రాజ‌శేఖ‌ర్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులే కాదు.. వీళ్ల వెన‌కాల ఎవ‌రున్న త‌ప్ప‌కుండా వారిని క‌ఠినంగా శిక్షిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement