Friday, April 19, 2024

రైతు వేదికలో టీఆర్ఎస్ నేతల మందు పార్టీ

నిజామాబాద్ జిల్లా నిందిపేట్‌లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మందు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రైతు వేదిక నూతన భవనాన్ని ప్రారంభించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. రాత్రి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతు వేదిక భవనంలో మందు పార్టీ చేసుకున్నారు. ఆపై చిందులేశారు. టీఆర్ఎస్ నేతల నిర్వాకంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు కొందరు రైతు వేదిక భవనం వద్దకు వచ్చారు. మందు పార్టీని వీడియో తీస్తున్న క్రమంలో మందుబాబులు పారిపోయారు.

కాగా, రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండటంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతు వేదికలు నిర్మించింది. పంటల సాగుపై రైతులకు వివరించడానికి రైతు వేదికలు చక్కటి వేదికలుగా ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి వారి సమస్యలను పరిష్కరించడానికి సులభంగా ఉంటుంది. ఇలాంటి చోట టీఆర్ఎస్ నాయకులు మందు పార్టీ చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement