తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్రెడ్డి వరుసగా పార్టీలోని సీనియర్లతో భేటీలు అవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న కీలక నాయకులను కలిసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఈ రోజు ఆయన కర్ణాటకకు వెళ్లిన రేవంత్ కు బెంగళూరు విమానాశ్రయంలో ఆయనకు అక్కడి కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా పేరొందిన డీకే శివకుమార్ను రేవంత్ మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ప్రకటన అనంతరం తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులను వారికి వివరించారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఇప్పటికే రాష్ట్ర నాయకులను ఏటతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న రేవంత్.. జాతీయ స్థాయిలో నేతలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, ఈ నెల 7న రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ఉదయం 10 గంటలకు పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారికి పూజలు చేస్తారు. అనంతరం నాంపల్లిలోని దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కీలక నేతలు రానున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: నవ సూచనలు పేరుతో జగన్కు రఘురామ లేఖ