Tuesday, April 23, 2024

Live Update | రైలు ప్రమాద బాధ్యులను వదిలేది లేదు.. దర్యాప్తునకు ఆదేశించాం: ప్రధాని

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. సంఘటనా స్థలానికి  చేరుకుని పరిశీలించిన ఆయన.. కటక్​లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రధాని. రైలు ప్రమాదం తనను తీవ్రంగా  కలిచివేసిందన్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు  ఆదేశించామని,  ప్రమాద కారకులపై కఠిన  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమన్న ప్రధాని.. ఈ ఘటనలో  చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  సహాయక చర్యల్లో ఒడిశా ప్రభుత్వం అన్ని విధాల సహకరించిందని చెప్పుకొచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను అదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులకు ధన్యవాదాలు తెలిపారు.

కాగా, ఒడిశా రైలు ప్రమాద బాధితులకు రైల్వే శాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇక.. పశ్చిమబెంగాల్​ సీఎం మమతా బెనర్జీ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బెంగాల్​ ప్రయాణికులకు తమ రాష్ట్ర తరపున మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ఇవ్వనున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement