Friday, April 19, 2024

Big Story: విభజన భేటీకి వీలుగా ఈ-సమీక్ష పోర్టల్‌ అప్‌డేట్‌.. 23న ఏపీ, తెలంగాణ ద్వైపాక్షిక స‌మావేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పెండింగ్‌ అంశాల పరిష్కారం దిశగా కీలక అడుగు పడుతోంది. ఈ నెల 23న జరగనున్న ద్వైపాక్షిక భేటీలో తెలంగాణ లేవనెత్తాల్సిన అంశాలతో నివేదిక ఖరారు చేసింది. అయితే కేంద్రం సూచించిన ఈ సమీక్ష వెబ్‌ పోర్టల్‌లో తెలంగాణ సమగ్ర వివరాలను అప్‌డేట్‌ చేసింది. ఈ అంశలనే క్యాబినెట్‌ సెక్రటరీ పరిగణలోకి తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏయే శాఖలకు చెందిన అంశాలు కేంద్రంతో పరిష్కారం నోచకుండా పెండింగ్‌లో ఉన్నాయో చెబుతూ వాటిని ఈ సమీక్ష పోర్టల్‌లో అప్‌డేట్‌ చేసేందుకు ఈ నెల 10ని గడువుగా నిర్దేశించారు.

17శాఖలు ఆయా సర్క్యులర్‌ మేరకు స్టేటస్‌ను అప్‌డేట్‌ చేశారు, ఆయా మంత్రిత్వ శాఖల్లో ఏఏ అంశాలు ఏఏ విధంగా పెండింగ్‌లో ఉన్నాయి…అందుకు కారణాలేంటి, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, అందుకు గడువును ఫిక్స్‌ చేసేలా నివేదికలో పొందుపర్చారు. సీఎస్‌ కార్యాలయంనుంచే నేరుగా ఈ సమీక్ష పోర్టల్‌ను అప్‌డేట్‌ చేశారు.

23న ముహూర్తం…కీలక అంశాలతో ఎజెండా..

- Advertisement -

ఇరు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఈ నెల 23న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఆరు తెలుగు రాష్ట్రాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో ఇప్పటివరకు ఎటూ తేల్చకుండా చిక్కుముడులు పడిన అనేక సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ ఉన్నట్లుగా తెలిసింది. సెప్టెంబర్‌ 27న జరిగిన సమావేశంలో 7 ఉమ్మడి అంశాలపై చర్చించిన గత భేటీలో ఏపీ లేవనెత్తిన ప్రతీ అంశానికి తెలంగాణ తనదైన శైలిలో వాస్తవాలతో కూడిన అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో పోటాపోటీగా ఎటువంటి కీలక నిర్ణయాలకు పరిష్కారం చూపకుండానే కేవలం సలహాలతో సమావేశం ముగించారు. దీంతో గత సమస్యలు అనేకం అలాగే పెండింగ్‌లో పడిపోయాయి. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను 10ఏళ్లలో పూర్తి చేయాలని చట్టంలో ఉంది. ఈ నిబంధన మేరకు తాజాగా మరోసారి భేటీకి కేంద్ర హోంశాఖ సమావేశానికి నిర్ణయం తీసుకున్నది.

గత భేటీలో తేలని అంశాలను కూడా..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య విభజన సమస్యలు, వివాదాల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 27న న్యూఢిల్లి నార్త్‌ బ్లాక్‌లో జరిగిన భేటీలో రెండు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. అప్పటి భేటీలో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014కు లోబడి తీసుకునే అన్ని నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలంగాణా ప్రభుత్వం ఈ సమావేశానికి వివరించింది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ ఏపీ ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆక్షేపించింది. అనేక అంశాలపై కోర్టుకు వెళ్తూ ఏపీ కాలం వృధా చేస్తోందని కేంద్ర హోంశాఖకు తెలంగాణ ఫిర్యాదు చేసింది.

గత సమావేశంలో విద్యుత్‌ బకాయిల విషయం తేలలేదు. షెడ్యూల్‌ 9 సంస్థల విషయంలో డాక్టర్‌ షీలాభిడే కమిటీ సిఫార్సులను పూర్తిస్థాయిలో ఆమోదించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పీటముడి వేసింది. 2017 మే నెలలో ఇచ్చిన హెడ్‌ క్వార్టర్‌ నిర్వచనం మేరకే వాటిని విభజించాలని తెలంగాణ మరోసారి నివేదికలో వెల్లడిస్తోంది. జిల్లాల్లో ఉన్న షెడ్యూల్‌ 10 ఆస్తుల పంపకానికి నిబంధనలు ఒప్పుకోవన్న తెలంగాణా వాదనకు కేంద్రం మద్దతు తెలిపింది. సెక్షన్‌ 53 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా 68 సంస్థల విభజనకు గతంలోనే ఓకే చెప్పడంతో తెలంగాణకు మేలు జరిగే అవకాశం ఉంది. షీలా భిడే కమిటీ చేసిన మిగిలిన 23 సంస్థల విభజన నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ ఈ సమావేశానికి తెలపనున్నది.

ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కేసులో, షెడ్యూల్‌ 10 సంస్థల ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అధికార పరిధి లేదని తెలంగాణ పేర్కొనాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో లేని 32 సంస్థల విభజన కుదరదని తెలంగాణ తేల్చి చెప్పి వాటిని విభజించాలంటే చట్ట సవరణ అవసరమన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ వాదనకే కట్టుబడి ఉంది. వాటిలో 10 సంస్థలు మూత పడ్డాయని తాజాగా వెల్లడించనుంది. పునర్విభజన చట్టంలో పొందుపరచని అంశాలను రాష్ట్ర విభజన జరిగిన 3 ఏళ్లలోపే కేంద్రం దృష్టికి తీసుకురావాలని సెక్షన్‌ 66లో స్పష్టంగా ఉంది.

పునర్విభజన చట్ట ప్రకారం షెడ్యూల్‌ 10 సంస్థల విభజన జరిపితే అభ్యంతరం లేదన్న తెలంగాణ ఇదే వాదనను వినిపించేందుకు సిద్దమవుతున్నది. షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ అనవసరంగా కోర్టు గడప తొక్కింది. అందువల్లే విభజనలో జాప్యం అవుతోందని విభజన భేటీలో ప్రస్తావించేలా నివేదికలు రూపొందించుకున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement