వాషింగ్టన్ : చైనాపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. డ్రాగన్కు చెందిన బయోటెక్, నిఘా కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలపై ఈ ఆంక్షలు అమలవుతాయని అమెరికా చెప్పుకొచ్చింది. దీనికి కారణాన్ని కూడా వెల్లడించింది. యుగుర్ ముస్లింలపై చైనా అతి క్రూరంగా ప్రవర్తిస్తోందని మండిపడింది. మానవ హక్కుల ఉల్లంఘనకు దిగుతోందని విమర్శించింది. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా స్పష్టం చేసింది. ఈ ఆంక్షలతో.. లైసెన్సు లేకుండా ఈ కంపెనీలకు ఎలాంటి వస్తువులు అమెరికా కంపెనీలు విక్రయాలు జరపలేదు.
చైనా సైన్యానికి మద్దతుగా బయో టెక్నాలజీని ఉపయోగిస్తున్న చైనా అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్, సైన్సెస్ దానికి సంబంధించిన 11 పరిశోధన సంస్థలను అమెరికా వాణిజ్య శాఖ లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి గినా రైమాండో మాట్లాడుతూ.. బయోటెక్, వైద్య ఆవిష్కరణలను ప్రజలపై నియంత్రణ, మతపరమైన మైనార్టీల అణిచివేతకు చైనా ఉపయోగిస్తోందన్నారు. పథకం ప్రకారమే.. యుగుర్లను అణివేస్తోందని మండిపడ్డారు. బయోమెట్రిక్ ముఖ గుర్తింపు వ్యవస్థతో పాటు అధునాతన నిఘా సాధనాలను డ్రాగన్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. 12-65 ఏళ్ల మధ్య వారికి డీఎన్ఏ నమూనాలు కూడా సేకరించిందన్నారు. ఇలా ఎందుకు చేసిందో చైనా చెప్పగలదా..? అని ప్రశ్నించారు. ఓ పక్కా పథకం ప్రకారమే.. ఇలా చేస్తోందని మండిపడ్డారు.