Thursday, April 25, 2024

వ్యూహాలు అమలు చేసే ముందు ఆలోచించండి.. సామాన్యుల జీవనోపాధి దెబ్బతినకూడదు: మోడీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కోవిడ్-19 కట్టడి కోసం వ్యూహాలు రూపొందించే ముందు సామాన్యుల జీవనోపాధి, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కోవిడ్-19 తాజా పరిస్థితి, కట్టడిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యున్నతస్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం గం. 4.30 సమయంలో వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డా. భారతి పవార్ సహా ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్-19 కట్టడి కోసం అవసరాన్నిబట్టి అక్కడికక్కడ స్థానిక ఆంక్షలు విధించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ శతాబ్దిలోనే అతిపెద్ద మహమ్మారితో భారతదేశం చేస్తున్న యుద్ధం 3వ సంవత్సరంలోకి ప్రవేశించిందని గుర్తుచేస్తూ, 130 కోట్ల మంది భారతీయులు ఖచ్చితంగా కరోనాపై విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

‘ఒమిక్రాన్’ గురించి ఇంతకుముందున్న సందేహాలు ఇప్పుడు క్రమక్రమంగా తీరుతున్నాయని, ఈ వేరియంట్ మునుపటి వేరియంట్‌ల కంటే చాలా రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రధాని అన్నారు. దీన్ని ఎదుర్కొనే క్రమంలో అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని, కానీ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ పండుగల సీజన్‌లో ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తత ఎక్కడా తగ్గకుండా చూడాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకటిలా ముందస్తు, సమయానుకూల, సమష్టి విధానాలతో పోరాడాలని పిలుపునిచ్చారు.

శ్రమించడమే ఏకైక మార్గం.. విజయం తప్ప – లేదు మరో ప్రత్యామ్నాయం
కోవిడ్-19 కట్టిడిలో శ్రమించడమే ఏకైక మార్గమని, విజయం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ప్రధాని మోదీ అన్నారు. మనం కరోనా వ్యాప్తిని ఎంత ఎక్కువగా నిలువరించగలమో సమస్య అంత తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. భారతదేశంలో తయారైన వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా తమ పనితీరును నిరూపించుకుంటున్నాయని అన్నారు. దేశంలో దాదాపు 92% జనాభాకు మొదటి డోసు అందించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. దేశంలో 2వ డోస్ కవరేజ్ కూడా దాదాపు 70 శాతానికి చేరుకుందని చెప్పారు. 10 రోజుల వ్యవధిలో, దేశంలో దాదాపు 30 మిలియన్ల మంది కౌమారదశ పిల్లలకు టీకాలు అందించగలిగామని అన్నారు.

ఇది భారతదేశ సామర్థ్యాన్ని చూపుతోందని, సవాళ్లను ఎదుర్కోవడంలో మన సంసిద్ధతను చాటుతుందని వెల్లడించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వయోధికులకు ఎంత త్వరగా ముందుజాగ్రత్త మోతాదును అందిస్తే, మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యం అంతగా పెరుగుతుందని అన్నారు. 100% వ్యాక్సినేషన్ కోసం ‘హర్ ఘర్ దస్తక్’ ప్రచారాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. వేరియంట్ ఏదైనా కానీ, వ్యాక్సినేషన్ ఒక్కటే దాన్ని ఎదుర్కొనే సమర్థవంతమైన మార్గమని ఆయనన్నారు. భవిష్యత్తులో రాబొయే కొత్త వేరియంట్లను దృష్టిలో పెట్టుకుని ఇప్పణ్ణుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

ఆరోగ్య వసతులు, మౌలిక సదుపాయాలను పెంపొందించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 23 వేల కోట్ల ప్యాకేజిని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవడంపై మెచ్చుకున్నారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 800 పీడియాట్రిక్ యూనిట్లు, 1.5 లక్షల ఐసీయూ – హెచ్‌డీయూ పడకలు, 5 వేలకు మించి ప్రత్యేక అంబులెన్సులు, 950 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ స్టోరేజి ట్యాంకులు సమకూరినట్టు పేర్కొన్నారు. అయితే కరోనాను ఓడించే క్రమంలో ఈ వసతుల కల్పన మరింతగా పెంచుకుంటూ వెళ్లాల్సిందేనని, కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అన్నారు.

సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోగ్య వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై కృతజ్ఞతలు తెలియజేశారు. తమ తమ రాష్ట్రాల్లో కోవిడ్-19 కొత్త కేసుల తాజా పరిస్థితి, తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్, సమస్యలు, సవాళ్ల గురించి ప్రధానితో చర్చించారు. కర్నాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. బెంగళూరు నగరంలో పెరిగిన కేసుల గురించి చెప్పి, నియంత్రణ కోసం చేపట్టిన చర్యల గురించి వివరించారు. అలాగే ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం కల్గిన పడకల సామర్థ్యాన్ని పెంచినట్టు తెలిపారు. పండుగ సీజన్లో బెంగాల్ రాష్ట్రంలో పెరిగిన కొత్త కేసుల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాట్లాడినట్టు తెలిసింది.

తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. కరోనాపై పోరులో కేంద్రంతో కలిసి పోరాడతామని వ్యాఖ్యానించారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ రాష్ట్రంలో ప్రజల్లో నెలకొన్న అపోహలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో సవాళ్లు ఎదుర్కొంటున్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కోవిడ్-19 వ్యాక్సిన్ అందుకోలేని పరిస్థితి లేకుండా చూస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆరోగ్య వసతుల కల్పన కోసం కేంద్రం చేసిన ఆర్థిక సహాయంపై పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ ఛన్ని ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ముందుజాగ్రత్త డోసు ప్రజల్లో భరోసా తీసుకొచ్చిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కవరేజి పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని మణిపూర్ సీఎం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement