Friday, April 19, 2024

Spl Story | ‘నైతిక బాధ్యత నాదే’.. రైలు ప్రమాదంతో కేంద్ర మంత్రుల రాజీనామాలు!

ఒడిశాలోని బాలాసోర్​ వద్ద నిన్న రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 400 మంది వరకు చనిపోయి ఉంటారనే వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అశ్విని వైష్ణవ్​ హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అంచనా వేశారు. అధికారులకు సూచనలు చేస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటివరకు అశ్విని వైష్ణవ్ నుంచి రాజీనామా ప్రకటన ఏదీ రాలేదు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రైలు ప్రమాద ఘటనలు జరిగిన సందర్భాల్లో ఇంతకుముందు బాధ్యతల్లో ఉన్న వారు వెంటనే దానికి బాధ్యులము తామేననటి ప్రకటించుకుని స్వచ్ఛందంగా రాజీనామా చేసిన సందర్భాలున్నాయి.  గతంలో పలువురు రైల్వే మంత్రులు ఘోర ప్రమాదాలు జరిగిన సమయంలో నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన ఉదాహరణలున్నాయి.

- Advertisement -

ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కేబినెట్లో రైల్వే మంత్రిగా పనిచేశారు లాల్ బహదూర్ శాస్త్రి.  1956లో ఆయన హయాంలో రెండు రైలు ప్రమాద ఘటనలు జరిగాయి. ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రైలు ప్రమాదంలో 112 మంది చనిపోయారు. దీంతో లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేయగా, నాటి ప్రధాని నెహ్రూ దీన్ని ఆమోదించలేదు. ఆ తర్వాత నవంబరులో తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదంలో 144 మంది చనిపోయారు. ఈ ఘటనకు బాధ్యుడిని తానేనని పేర్కొంటూ మరోసారి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. అయితే.. ఈసారి ప్రధాని నెహ్రూ ఆ రాజీనామాను ఆమోదించారు.

ఆ తర్వాత 1999 ఆగస్టులో అసోంలో జరిగిన రైలు ప్రమాదంలో 290 మంది మృతిచెందారు. ఆ సమయంలో కేంద్ర రైల్వే మంత్రిగా నితీశ్ కుమార్ ఉన్నారు. ఆయన అసోం రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ గతంలో ఎన్డీయే సర్కారులో రైల్వే మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో రెండు రైలు ప్రమాదాలు జరిగాయి… ఆ క్రమంలో మమతా రాజీనామా చేయగా, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆమె రాజీనామాను ఆమోదించలేదు.

2016లో జరిగిన రైలు ప్రమాదాలకు అప్పటి మంత్రి సురేశ్ ప్రభు నైతిక బాధ్యతను స్వీకరించారు. కొంత సమయం వేచిచూడాలని ప్రధాని మోదీ కోరినా… ఆ తర్వాత నెలరోజులకే సురేశ్ ప్రభు రైల్వే మంత్రి పదవి నుంచి వైదొలిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement