Sunday, March 24, 2024

ముందు మీరు చేయండి.. మేమూ చేస్తాం

మద్య నిషేధంపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మద్య నిషేధం చేస్తే.. తెలంగాణలోనూ చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఓ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో తెలంగాణ ముందుంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ దేశంలో మద్యనిషేధం చేయకుండా తెలంగాణలో మాత్రమే చేస్తే ఇక్కడ మాఫియా పెరిగిపోతుందన్నారు. అటు కల్లునుతక్కువ చేసి చూడటం సరికాదని, అది దేవతలు తాగిన పానీయమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శాసనసభలో వ్యాఖ్యలు చేశారు. దేవతలు సురాపానం చేయటమంటే.. చెట్టు నుంచి గీసిన కల్లు తాగటమేనని, కల్లు ఆధారంగా ఎన్నో కులవృత్తుల వారికి లబ్ధి చేకూరుతోందని, అందుకే అది పెద్ద కుటీర పరిశ్రమేనని వెల్లడించారు.

అటు పద్దులకు సంబంధించి అసెంబ్లీలో చర్చ అనంతరం మంత్రులు సమాధానం ఇచ్చే సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం పొద్దుపోయేవేళకు కేవలం ఆరుగురు మంత్రులే సమాధానం చెప్పారు. మరో ఐదారుగురు సమాధానం ఇవ్వాల్సి ఉంది. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రులు మాట్లాడాలని స్పీకర్‌ పదేపదే పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడే ముందు కూడా ఇదే సూచన చేశారు. దీంతో ‘మీరు వ్యవసాయ మంత్రిగా ఉండగా పద్దులపై మాట్లాడటాన్ని మేం ఆసక్తిగా వినేవాళ్లం. కొన్నిసార్లు రాత్రి 12 గంటల సమయంలో కూడా మీరు మాట్లాడారు. మిమ్మల్నే మేం ఆదర్శంగా తీసుకుంటున్నాం. మీ వారసత్వాన్ని కొనసాగిస్తాం’అని వ్యాఖ్యానించడంతో స్పీకర్‌ సహా సభ్యులు నవ్వుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement