Thursday, April 25, 2024

తెలంగాణ భేష్ – జాతీయ ఆర్ధిక సంస్థ‌ల ప్ర‌శంస‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ఆర్ధిక ఆంక్షలు ఇప్పటికీ తగ్గలేదు. ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ తెెలంగాణ సర్కార్‌ ఆర్ధిక ఇబ్బందులను నేర్పుగా నెట్టుకొస్తున్నది. ఈ అంక్షలపై త్వరలో జాతీయ స్థాయిలో గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన అనేక కార్యక్రమాలు, చర్యలతో గడచిన ఐదారేళ్లుగా ఆర్ధిక సుస్థితరను కొనసాగించుకుంటూ ముందుకు సాగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా వ్యయాలు, వేతనాలతో సతమతమవుతూనే అంతే గొప్పగా ఆర్ధిక స్థిరత్వానికి ముందుచూపుతో కీలక చర్యలు తీసుకుంటున్నది. గతేడాదికంటే రూ. 1500కోట్లు అదనంగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లపైనే భారం పెరిగినప్పటికీ పీఆర్సీ ప్రకటన వంటి అంశాల్లో జాప్యం చేయలేదు. అంతేస్థాయిలో ఇతర వ్యయాలు కూడా భారీగా పెరగ్గా, రాబడిని అంతకంతకూ పెంచుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఎన్నికల ఏడాదిలో మిగిలిపోయిన చివరి మాసాలలో ఆర్ధికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసే చర్యలపై సర్కార్‌ దృష్టిసారించిందని చెబుతున్నారు.

తెలంగాణకు జాతీయ స్థాయిలో ఉత్తమ పేరు ప్రఖ్యాతులు…
సకాలంలో బిల్లులు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలకు నిధులు, వేతనాలు, పింఛన్ల వంటి భారీ మొత్తాలకు నిధులను సర్దుబాటు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నది. అయినప్పటికీ రుణాలపై వడ్డీలను సకాలంలో చెల్లిస్తోందనే ఖ్యాతిని జాతీయ స్థాయిలో కాపాడుకుంటోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పూచీకత్తు రుణాలు, ఇతర అప్పులకు వడ్డీలను సకాలంలో చెల్లిస్తూ ఇందుకు నెలకు రూ. 1683కోట్లను చెల్లిస్తున్నది. ఇదే సమయంలో గతేడాది నెలకు రూ. 1466 కోట్లను సగటుగా చెల్లింపులు వడ్డీలకు చేసింది.

కేంద్ర పాపమే…
కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల కారణంగా రాష్ట్రాల వృద్ధిరేటు కుంటుపడుతోంది. అయినప్పటికీ ఎటువంటి ప్రతికూలతలనైనా సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆర్ధిక క్రమశిక్షణతో ముందుకు వెళుతున్న తెలంగాణ తాజా ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడిలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎస్‌ఎస్‌, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్‌ 12.9 శాతం తగ్గినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఈ వృద్ధి రేటును నమోదు చేయడం ఆర్ధిక క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇంకా తప్పని షరతుల ఆంక్షలు….
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను సకాలంలో ఇవ్వకపోవడం, అప్పుల పరిమితుల్లో కోతలు విధించడం వంటి వాటితోపాటు, కొత్త కొత్త చట్టాలతో షరతులు విధించి వాటిని అమలు చేస్తేనే అప్పుల పరిమితిని పెంచుతామని కేంద్రం బెదిరింపులకు కేంద్రం దిగుతోంది. గతేడాదిలో ఎఫ్‌ఆర్‌బీఎంలో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్ర ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేదని ఆర్ధిక వర్గాలు అంచనా వేశాయి. కేంద్ర ప్రభుత్వంనుంచి కేంద్ర ప్రాయోజిత పథకాల రూపంలో గత 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ. 47,312 కోట్లు నిధులు మాత్రమే తెలంగాణకు అందినట్లు లెక్కలు ధృవీకరిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలిస్తే అనేక అంశాలు వెల్లడవుతున్నాయి. ఇది కేంద్రానికి మింగుడు పడటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్‌ గత నాలుగు సంవత్సరాల్లో ఒక్క రైతుబంధు పథకం కింద రాష్ట్ర రైతాంగానికి రూ. 58,024 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించినట్లు ఆర్థికశాఖ నివేదికద్వారా వెల్లడైంది.

- Advertisement -

తగ్గుతున్న కేంద్ర వితరణ…
గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 లక్ష 84 కోట్ల నిధులను వివిధ క్యాపిటల్‌, ఇతర ఎక్స్‌పెండిచర్‌ చేయగా, సీఎస్‌ఎస్‌ పథకాల కింద కేంద్రంనుంచి అందింది రూ.5200 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం 62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి రూ. 1 లక్షా 84వేల కోట్లకు పెరిగి తొమ్మిదేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచి ఆర్ధిక పురోగతిలో దూసుకుపోతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement