సమాచార లోపం కారణంగా సైదాబాద్ అత్యాచార ఘటన నిందితుడు దొరికాడంటూ మంత్రి కేటీఆర్ పొరపాటుగా ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అత్యంత పాశవిక దారుణాలకు మద్యం, గంజాయి, డ్రగ్స్ కారణమని మండిపడ్డారు. సైదాబాద్ ఘటన జరిగిన 24 గంటల్లో శిక్షించాలని కేటీఆర్ ట్విట్టర్లో డీజీపీని కోరాడని.. అయినా పోలీసులు ఐదు రోజుల తర్వాత కూడా తమకు నిందితుడు దొరకలేదని ప్రకటన చేశారని మండిపడ్డారు.
అసలు తెలంగాణలో పాలన ఉందా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. సీఎం కేసీఆర్ పుత్ర రత్నం ట్విట్టర్లో ఒకటి… పోలీసులు మరోమాట చెబుతున్నారని నిప్పులు చెరిగారు. ట్వీట్ చేసిన సమయంలో ఏ మైకంలో ఉన్నాడని కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. కేటీఆర్కు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ వాడిన వాడు ఎవడైనా లోపల వెస్తం అన్నారని.. కానీ అకున్ సబర్వాల్ విచారణ మొదలవ్వగానే ఆయన్ను బదిలీ చేశారని నిప్పులు చెరిగారు. డ్రగ్స్ ఇతర దేశాల నుంచి ఇక్కడికి ఎలా వస్తుందనే దానిపై విచారణ చేయాలన్నారు.