Thursday, April 18, 2024

Order Order | కేంద్రంపై సుప్రీం సీరియస్​.. వన్ ర్యాంక్-వన్‌ పెన్షన్‌ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఆదేశం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. వన్‌ ర్యాంక్‌ – వన్‌ పెన్షన్‌ బకాయిల చెల్లింపులపై రక్షణ మంత్రిత్వశాఖ సమాచారం ఇవ్వడంపై కేంద్రానికి మొట్టికాయలు వేస్తూ చివాట్లు పెట్టింది. పెన్షన్‌ విధానంలో ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుందంటూ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్ధివాలాతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

– ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

వన్‌ నేషన్‌ – వన్‌ పెన్షన్‌ని నాలుగు వాయిదాల్లో చెల్లించాలని జనవరి 20న జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఇవ్వాల (సోమ‌వారం) ఆదేశించింది. రక్షణ మంత్రిత్వ శాఖ జనవరి 20న ఇచ్చిన సమాచారం తమ తీర్పున‌కు పూర్తిగా విరుద్ధమని, నాలుగు విడతల్లో బకాయిలు చెల్లిస్తామని ఏకపక్షంగా చెప్పలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, రక్షణ మంత్రిత్వశాఖ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మాజీ సైనికులకు బకాయిలు ఉన్న వన్‌ ర్యాంక్‌ – వన్‌ పెన్షన్‌ బకాయిలను ఒకే విడుతలో చెల్లించామని, అయితే పూర్తిగా చెల్లించేందుకు మరికొంత సమయం కావాలని అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకరమణి న్యాయస్థానాన్ని కోరారు.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు బకాయిల చెల్లింపుపై తొలుత జారీచేసిన జనవరి 20 నాటి నోటిఫికేషన్‌ను ఉప సంహరించుకోవాలని, ఆ తర్వాత దరఖాస్తును సకాలంలో పరిశీలిస్తామని చెప్పింది. అలాగే చెల్లింపు ప్రక్రియ కోసం అనుసరించాల్సిన పద్ధతులు, ప్రాధాన్యానికి సంబంధించి వివరాల నోట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఏదో ఒక రకమైన వర్గీకరణ ఉండాలని, వృద్ధులకు మొదట బకాయిలు చెల్లించాలని తాము కోరుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement