Friday, April 26, 2024

న‌డ్డా కామెంట్స్‌కి సూప‌ర్ కౌంటర్‌.. వారి విద్యార్హ‌త‌లు అడ‌గ‌బోమంటూ చుర‌క‌లు!

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ నడ్డా (జేపీ న‌డ్డా) ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తూ అక్క‌డి ప్ర‌భుత్వాల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సీఎంల‌ను ఛీప్ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ‌లోనూ సీఎం కేసీఆర్‌పై, అత‌ని కుటుంబంపై చాలా సార్లు ఇట్లానే మాట్లాడారు. అయితే.. అంతే దీటుగా ఆ పార్టీ లీడ‌ర్ల‌కు సీఎం కేసీఆర్ రిప్ల‌య్ ఇచ్చారు. కుటుంబ పాల‌న అంటూ చేసిన కామెంట్స్‌కి దిమ్మ‌దిరిగే కౌంట‌ర్‌ని మంత్రి కేటీఆర్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు త‌మిళ‌నాడు వంతు వ‌చ్చింది. అక్క‌డి ప‌ర్య‌ట‌న‌లో ఉన్న న‌డ్డా స్టాలిన్‌పై కారుకూత‌లు కూశారు. దీనికి ప్ర‌తిగా డీఎంకే పార్టీ నుంచి వ‌చ్చి ఆన్స‌ర్ ఏంటంటే..

– డిజిట‌ల్ మీడియా, ఆంధ్ర‌ప్ర‌భ‌

త‌మిళనాడులో పర్యటించిన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డీఎంకే ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. అందుకు డీఎంకే (ద్ర‌విడ మున్నెట్ర క‌జ‌గం) పార్టీ అంతే సీరియ‌స్‌గా రెస్పాండ్ అయ్యింది. తమిళనాడు సర్కారు అనుసరిస్తున్న విద్యావిధానం, నీట్ ను వ్యతిరేకిస్తుండడాన్ని నడ్డా త‌ప్పుబ‌ట్టారు. చదువు రాని వాళ్లు పాలిస్తే ఇట్ల‌నే ఉంటుందని సీఎం స్టాలిన్ ను ఉద్దేశించి ఛీప్‌ కామెంట్స్ చేశారు. అందుకు డీఎంకే అదేస్థాయిలో బదులిచ్చింది.

కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న వారి విద్యార్హతలు తాము అడగబోమని, ఆ స్థాయికి తాము ఇంకా దిగజారలేద‌ని కౌంటర్ ఇచ్చింది డీఎంకే. బీజేపీలోని వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తూ, అసలు జై షా ఎవరు? ఎన్ని సెంచరీలు కొట్టారు? క్రికెట్‌తో సంబంధం లేని వ్య‌క్తికి బీసీసీఐ సెక్రెట‌రీ ప‌ద‌వి ఎట్లా వ‌చ్చింది? అన్న ప్ర‌శ్న‌లు సంధించింది డీఎంకే పార్టీ..

అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి కుమారుడు అయినందుకే జై షా భారత్ లో సుసంపన్నమైన క్రీడాబోర్డు బీసీసీఐకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారని డీఎంకే వివరించింది. విద్వేష, విచ్ఛిన్నకర రాజకీయాలకు బీజేపీ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంద‌ని అభివర్ణించింది. వచ్చే ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు బీజేపీకి గ‌ట్టి బుద్ధి చెబుతారని, తమిళనాడు ప్రజలు ఎంతో వివేకవంతులని డీఎంకే పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement