ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఇవ్వాల సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హైదరాబాద్ కు 170 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కాగా, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో రాహుల్ త్రిపాఠి మెరుగైన ఆటతీరు ప్రదర్శించాడు. 30 బంతుల్లో 44 పుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత నిఖోలస్ పూరన్ కూడా బాగానే ఆడాడు. 23 బంతుల్లో 34 పరుగులు చేసి తనదైన తీరు ఆటతో ఆకట్టుకున్నాడు. ఇక అభిషేక్ శర్మ (13), కేన్ విలియమ్స్ (16), మార్క్రాం (12), వాషింగ్టన్ సుందర్ (16) పరుగులు మాత్రమే చేశారు. దీంతో 18 ఓవర్లప్పుడు హైదరాబాద్ స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మరో రెండు ఓవర్లు ఉండగా.. 26 పరుగులు చేయాల్సి ఉంది..
అయితే.. తొలుత లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా హాఫ్ సెంచరీలతో రాణించారు. రాహుల్ 50 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. దీపక్ హుడా 33 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, నటరాజన్ తలో రెండు వికెట్లు తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టుకు ఆరంభంలోనే హైదరాబాద్ బౌలర్లు వరుస షాకులిచ్చారు. దీంతో పవర్ ప్లేలోనే లక్నో జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా హాఫ్ సెంచరీలతో రాణించడంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో క్వింటన్ డి కాక్ (1), ఎవిన్ లూయిస్ (1), మనీశ్ పాండే (11), కృనాల్ పాండ్య (6) విఫలమయ్యారు. ఆఖరు బంతికి ఆయుష్ బదోని (19) రనౌటయ్యాడు. జేసన్ హోల్డర్ (8) నాటౌట్గా నిలిచాడు.
మెగా టోర్నీలో ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడిన లక్నో జట్టు.. గుజరాత్తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఆ తర్వాత చెన్నైతో జరిగిన రెండో మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది. మరోవైపు, రాజస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్ లో పరాజయం పాలైన హైదరాబాద్ జట్టు.. ఈ మ్యాచులోనైనా బోణీ కొడుతుందేమో చూడాలి. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెత్త బౌలింగ్, చెత్త బ్యాటింగ్ తో ఓటమిని కొని తెచ్చుకుంది హైదరాబాద్. తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే హైదరాబాద్ బరిలోకి దిగింది. లక్నో మాత్రం ఒక మార్పు చేసింది. గత మ్యాచ్ లో విఫలమైన చమీర స్థానంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ తుది జట్టులోకి వచ్చాడు. గత సీజన్ లో జేసన్ హోల్డర్ సన్ రైజర్స్ కు ఆడటం విశేషం.