Thursday, March 28, 2024

IPL 2021:మళ్లీ ఓడిన సన్‌రైజర్స్.. కోల్‌కతా చేతిలో హైదరాబాద్‌ ఓటమి

ఐపీఎల్ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ కు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన హైదరాబాద్‌.. ఆదివారం కోల్‌కతా చేతిలోనూ ఓటమి పాలైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులే చేసింది.కోల్‌కతా బౌలర్లు విసిరే బంతులకు బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ (26), ప్రియమ్ గార్గ్ (21), అబ్దుల్ సమద్ (25) కాస్తయినా రాణించడంతో హైదరాబాద్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. 

హైదరాబాద్ తమ ముందు ఉంచిన 116 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని కోల్‌కతా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (57),  నితీశ్ రాణా (25), దినేశ్ కార్తీక్ (18) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్‌కు రెండు, రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్‌కు చెరో వికెట్ దక్కాయి. శుభ్‌మన్‌ గిల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

కాగా, ఆడిన 12 మ్యాచుల్లో పదింటిలో ఓడిన హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement