లబ్ధిదారులకు శాశ్వత రేషన్కార్డులు మంజూరు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఇవ్వాల మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సలు చేసింది. హైదరాబాద్కు చెందిన ఎన్జీవో అసీమ్ చేసిన అభ్యర్థనలో ఈ ప్రతిపాదనలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ (నియంత్రణ) ఆర్డర్ 2016 నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. ఇప్పటికైతే జాతీయ ఆహార భధ్రత కార్డుదారులు, రాష్ట్ర ఆహార భద్రత కార్డుదారులు, అంత్యోదయ అన్నయోజన, అన్నపూర్ణ పథకాలకు చెందిన లబ్ధిదారులున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇంటింటికి శాశ్వత ‘రేషన్కార్డు’ లేదా ‘సరఫరా కార్డు’ను ప్రభుత్వం జారీ చేయలేదు. దీని కారణంగా లబ్ధిదారులు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (NFSA) కింద అర్హులైన వారికి నిత్యావసర వస్తువులను పొందడానికి ప్రతి నెలా వారి డిజిటల్ డేటాబేస్ నుండి ఆన్లైన్ ప్రింటౌట్లను తీసుకోవలసి వస్తోంది. రేషన్ పొందేందుకు ప్రతి సారి కొత్త ఆన్లైన్ ప్రింట్అవుట్లను తీసుకురావాలని చౌకధరల దుకాణం (ఎఫ్పిఎస్) యజమానులు లబ్ధిదారులను ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పేద లబ్ధిదారులు ఒక్కోసారి ప్రింట్అవుట్ కోసం దాదాపు 10 నుంచి 50 రూపాయల దాకా ఖర్చుపెడుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, క్యాబినెట్ సబ్కమిటీ ఇట్లాంటి ఆర్థికపరమైన చిక్కులను తొలగించేలా వివిధ స్మార్ట్ కార్డ్ లను ధ్రువీకరించింది. అందులో రాష్ట్రంలో ముద్రించిన ఆహార భద్రత కార్డుల జారీకి కూడా సిఫారసు చేసింది. ఆహార భద్రత కార్డుల నమూనాల్లో జాతీయ ఆహార భద్రత కార్డు, మరోటి రాష్ట్ర ఆహార భద్రత కార్డును రూపొందించాలని కమిటీ ఆదేశించింది.