Thursday, April 25, 2024

Story : గుజ‌రాత్ లో పోలింగ్.. ఉమ్మ‌డి కుటుంబంలో 81మంది.. ఓటు వేసిన 60మంది

నేడు గుజ‌రాత్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. కాగా రాష్ట్రంలో క‌మ్రేజ్ ప్రాంతానికి చెందిన సోలంకీ కుటుంబం అంద‌రినీ ఆశ్చర్య‌ప‌రిచింది. ఈ ఉమ్మడి కుటుంబంలో 81 మంది ఉన్నారు. కమ్రేజ్ ప్రాంతానికి చెందిన ఈ జంబో ఫ్యామిలీ ఐకమత్యానికి, ఆప్యాయతానురాగాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అంతేకాదు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అతి భారీ కుటుంబం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కుటుంబంలో 60 మంది ఓటర్లు ఉండడం విశేషం. అతిపెద్ద వయసు కలిగిన ఓటరు 82 ఏళ్ల శ్యామ్ జీ భాయ్ కాగా… అందరిలో చిన్న వయసున్న ఓటర్లు 18 ఏళ్ల పార్థ్, వేదాంత్ లే.ఈ కుటుంబంలోని వారు అత్యధికులు ఒకే ఇంట్లో ఉంటారు. కొందరు కుర్రవాళ్లు మాత్రం పెళ్లిళ్లు అయ్యాక ఇంట్లో స్థలం చాలకపోవడంతో వేరే ఇళ్లలో నివసిస్తున్నారట.

నేడు గుజరాత్ లో ఎన్నికల పోలింగ్ కావడంతో సోలంకి కుటుంబ సభ్యులు అనేక వాహనాల్లో నవగ్రామ్ లోని పోలింగ్ బూత్ కు వెళ్లారు. దీనిపై ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరైన ఘనశ్యామ్ స్పందిస్తూ, తమ కుటుంబంలో పెళ్లికి అందరం ఎలా హాజరవుతామో, ఓటింగ్ ప్రక్రియలోనూ అంతే ఉత్సాహంతో పాల్గొంటామని చెప్పారు. కాగా ఈ కుటుంబం కమ్మరి పని చేస్తుంటుంది. వీరి స్వస్థలం బొటాద్ ప్రాంతంలోని లఖియాని గ్రామం.. కాగా వీరు 1985లో సూరత్ లోని కమ్రేజ్ కు వలస వచ్చారు. ఇప్పటికీ ఈ కుటుంబానికి చెందిన 15 మంది లఖియానీ గ్రామంలో నివసిస్తున్నారు. వారందరితో కలిపితే ఈ కుటుంబంలోని వారి సంఖ్య 96 అని చెప్పుకోవాలి. ఈ జంబో ఫ్యామిలీ ‘జ్యోతి’ బ్రాండ్ పేరిట వ్యవసాయ పనిముట్లు తయారుచేస్తుంటుంది. ఈ కుటుంబంలో ఆరు పదుల ఓట్లు ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయని వేరే చెప్పనక్కర్లేదు. అయితే, తాము ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని, బలమైన దేశ నిర్మాణం కోసం తాము ఓటు వేస్తామని, అందరం కలిసి చర్చించుకుని ఒకే పార్టీకి ఓటు వేస్తామని ఆ కుటుంబానికి చెందిన భవేశ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement