Wednesday, April 24, 2024

Big Story: భూ వివాదాల పరిష్కారానికి స్పెషల్​ ప్రోగ్రామ్​.. రెవెన్యూ సదస్సులకు ప్రభుత్వం ప్లాన్​

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల ముందే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. భూ వివాద రహిత గ్రామాల ప్రకటనకు ప్రభుత్వ షెడ్యూల్‌ సిద్దం చేస్తోంది. ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలోని 98శాతం రెవెన్యూ సమస్యలు పరిష్కారమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. కొన్ని సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో నియోజ‌కవర్గాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11.5లక్షల ఎకరాల్లోని వివాదాస్పద భూముల కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నిషేదిత జాబితాలోని పట్టా భూముల రికార్డుల సరిచేయ‌డం, భూ యాజమాన్య హక్కుల చట్టంలో నమోదు సందర్భంగా పట్టా భూముల నేచర్‌ మార్పు, మిగులు భూములు, ఇనాం, వక్ఫ్‌, ఓఆర్సీ సమస్యల వంటి వాటిని సీసీఎల్‌ఏ డైరెక్టర్‌ రజత్‌కుమార్‌ షైనీ నేతృత్వంలో విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. ఈ కసరత్తు పూర్తయిన వెంటనే రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసి గ్రామాల్లోకి పంపనున్నారు. తాజాగా నిషేదిత భూముల జాబితా క్లీయరెన్స్‌లో ప్రభుత్వం వేగం పెంచింది. అన్ని జిల్లాల కలెక్టర్లు తమవద్ద ఉన్న ధరణి రికార్డులలోని జాబితాను మండల తహశీల్దార్‌లకు పంపించి వివరాలు తెప్పించుకున్నారు.

ఈ రికార్డులను సీసీఎల్‌ఏకు చేరవేసి సుమోటాగా పరిష్కరిస్తున్నారు. ఇలా పాస్‌ పుస్తకాలు జారీ అయినప్పటికీ నిషేదిత జాబితాలో ఉన్నవాటినే పంపించగా, వీటికి కూడా కొందరు క్లీయరెన్స్‌ కోరుతూ దరఖాస్తులు చేయలేదు. దీంతో స్వతహాగా ప్రభుత్వమే క్లీయర్‌ చేయాలని నిర్ణయించడంతో ఈ పని వేగంగా జరుగుతోంది. ఇంకా డిజిటల్‌ సిగ్నేచర్‌ కాని, పాస్‌ పుస్తకాలు జారీ కాని భూములపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలా 11 లక్షల ఎకరాల భూములకు హక్కులులేవని పాస్‌ పుస్తకాలు నిరాకరించిన హక్కుల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. ఇంకా మరో 3.5లక్షల మందికి పెండింగఖ పాస్‌ పుస్తకాల జారీతోపాటు 2.5లక్షల మంది రైతులకు చెందిన రికార్డుల తప్పుల సరిజేత దిశగా యోచిస్తోంది.

- Advertisement -

ధరణిలో సమస్యల పరిష్కారం దిశగా సబ్‌ కమిటీ కీలక నివేదికను సిద్దం చేసింది. పలు అంశాలతో కూడిన సిఫార్సులను సిద్దం చేసి పలు రకాల సమస్యలకు పరిష్కారమార్గాలుగా కీలక ప్రతిపాదనలు రూపొందించింది. ఈ నేపథ్యంలో టీఎం 33 మ్యాడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ నోటీసుల జారీ పురోగతిలో ఉంది.

ప్రధానంగా పేరులో మార్పులు, చేర్పులు, విస్తీర్ణంలో మార్పులు, సర్వే నెంబర్‌ తొలగింపు, ఎన్వోసి, ఓఆర్సీ, 38ఈ, 13బి, సర్వే నెంబర్‌ను భిన్నమైన ఖాతాలకు మళ్లించడం, అసైన్డ్‌ భూములను పట్టాభూములుగా రికార్డుల మార్పు, ల్యాండ్‌ నేచర్‌, ల్యాండ్‌ టైప్‌ మార్చడం, మిస్సింగ్‌ నెంబర్‌, కొత సర్వే నెంబర్‌ను సృష్టించడం, కొత్త ఖాతా సృష్టి, లావాదేవి నిలుపుదల, ఖాతాల విలీనం వంటి వాటిపై స్పష్టత రావడంతో మెజారిటీ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఇంకా కొన్ని… భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూముల సర్వే నెంబర్లలలోని మొత్తం పట్టా భూములను నిషేదిత జాబితాలో చేర్చడం, కోర్టు కేసులు, ఇతర వివాదాలున్న సర్వే నెంబర్లను ఈ జాబితాలో ఉంచడం, వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో కొన్ని సర్వే నెంబర్లలోని భూములు నమోదు కాలేదు.

ఈ మిస్సింగ్‌ డేటాను సేత్వార్‌, ఖాస్రా పహాణీలో ఉన్న విస్తీర్ణం కంటే తక్కువగా ఉండే వాటి నమోదుకు అవకాశం కల్పించి ఆయా రైతులు రైతుబంధు, రైతు భీమా పథకాలకు అర్హులుగా మార్చాలని ప్రయత్నిస్తోంది. నాలా మార్పిడితో రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతారని, ఈ భూములను అమ్ముకునేందుకు, బ్యాంకులలో తనఖా పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయేతర భూమిగా నమోదైన వ్యవసాయ భూమిని భూమి వర్గీకరణ మార్పుకు అవకాశం కల్పించి రైతులకు పాస్‌ పుస్తకాల అందజేత వంటి పరిష్కారాలను యోచిస్తున్నారు. గజాలలో ఉన్న భూములకు కూడా మ్యుటేషన్‌ అవకాశం కల్పించాలని, ప్రభుత్వ అసైన్డ్‌ భూముల విషయంలో అమ్మకాలు, కొనుగోలు మినహా మిగతా వ్యవహారాలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అదనంగా డిజిటల్‌ సంతకాలు, తప్పుల సవరణలకు అవకాశం కల్పించాలని కూడా సిఫార్సులు చేయనున్నారు. నిషేదిత భూముల జాబితాను సబ్‌ డివిజన్‌ నెంబర్ల ఆధారంగా తిరిగి నమోదు చేయాలని, సంబంధంలేని మిగతా భూములను జాబితానుండి తొలగించనున్నారు. స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీతో క్రయవిక్రయదారులకు అవకాశం ఇచ్చే దిశగా యోచిస్తున్నారు. సర్వే నెంబర్‌ విస్తీర్ణంలో మార్పులకు, ఆధార్‌కు బదులుగా సంస్థ పాన్‌ కార్డుతో రిజిస్ట్రేషన్లకు అవకాశం పరిశీలిస్తున్నారు. తిరస్కరించిన మ్యుటేషన్‌ దరఖాస్తులకు మళ్లి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అమలులోకి తేనున్నారు. సంస్థ భాగస్వాముల రిజిస్ట్రేషన్‌లో సీఐఎన్‌ బదులుగా పాన్‌ నెంబర్‌ను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement