Thursday, March 28, 2024

గీత దాటిన బీజేపీ నేతలపై చర్యల కోసం కమిటీ ఏర్పాటు

హెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ కార్పొరేటర్‌ ఎన్నిక ఏకగ్రీవం విషయమై మాట్లాడేందుకు ఇటీవల మంత్రి కేటీఆర్‌‌ను ప‌లువురు బీజేపీ నేత‌లు కలిశారు. అయితే పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలు ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలవడంపై బీజేపీ అధిష్ఠానం గుర్రుగా ఉంది. కేటీఆర్‌ను క‌లిసి వారిపై చర్యలు తీసుకునే అవ‌కాశం ఉంది. కేటీఆర్‌ను బీజేపీ నేత‌లు క‌ల‌వ‌డంపై నిజనిర్ధారణ క‌మిటీ వేసి, చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. కేటీఆర్‌ను క‌లిసిన స‌మ‌యంలో బండి సంజయ్‌పై స‌ద‌రు మంత్రి ప‌లు కామెంట్లు చేసినా బీజేపీ నేత‌లు ఎందుకు ఉపేక్షించారన్న విష‌యంపై కూడా నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ఆరా తీయ‌నుంది.

క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని బండి సంజ‌య్‌కు అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావ‌డంతో ఈ రోజు ఆయ‌న దాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఈ క‌మిటీలో ఉన్నారు. రెండు రోజుల్లో తనకు రిపోర్ట్‌ ఇవ్వాలని కమిటీని బండి సంజయ్‌ ఆదేశించారు. కేటీఆర్‌తో భేటీ సందర్భంగా ప్రగతి భవన్‌లో ఏమి జరిగిందనే విష‌యంపై ఈ త్రిసభ్య కమిటీ తేల్చనుంది. ఇప్ప‌టికే రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డిని త్రిసభ్య కమిటీ విచారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement