Thursday, April 25, 2024

షర్మిల పార్టీ: గులాబీ నేతలకు ఎందుకు ఉలుకు?


తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఇంకా ఆవిర్భావం కాక ముందే.. టీఆర్ఎస్ పార్టీని షర్మిల అనుచరులు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రులకు షర్మిల టీమ్ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణలో ఓ మహిళ పార్టీ పెడుతుంటే.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు భయం పట్టుకుందని వైఎస్ షర్మిల అనుచరురాలు ఇందిరా శోభ అన్నారు. పోలవరం ముంపు మండలాలపై మంత్రి గంగుల కమలాకర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలవరం ముంపు మండలాలు… ఏపీకి ఎప్పుడు పోయాయో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ముంపు మండలాలు ఏపీలో కలిపిన ఏడున్నర ఏళ్ల తర్వాత గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండి ఏం చేశారని, గెజిట్ నోటిఫికేషన్లు ఇస్తుంటే మీరు ఏం ఉద్ధరించారు అని నిలదీశారు.
తెలంగాణ ప్రజలు రాజన్న పరిపాలన కోరుకుంటున్నారని ఇందిరాశోభన్‌ చెప్పారు. వైఎస్ షర్మిల పార్టీ పెడుతుంది అంటే టీఆర్ఎస్ నేతల కుసాలు కదులుతున్నాయని విమర్శించారు. బంగారు తెలంగాణ కాదు, బతుకులేని తెలంగాణగా తయారు చేశారంటూ ధ్వజమెత్తారు. గ్రామగ్రామానికి వైన్ షాప్ లను తీసుకెళ్లి తాగుబోతుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని ఫైర్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే షర్మిల తన జీవితాన్ని అంకితం చేశారన్నారని తెలిపారు. షర్మిలపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ టీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. పార్టీ ఆవిర్భావం ఎప్పుడు, ఎందుకు పెడుతున్నాం అనే అంశాలను ఏప్రిల్ 9న ప్రకటిస్తామని ఇందిరా శోభ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement