Friday, April 19, 2024

ఏడు రాష్ట్రాలు, 14 పెళ్లిళ్లు.. నిత్య పెళ్లికొడుకు అరెస్ట్

ఎప్పటికప్పుడు ప్రాంతాలు మారుస్తూ.. కొత్త కొత్త గెట‌ప్‌లతో నిత్య పెళ్లికొడుకులా మ‌రిన వ్య‌క్తిని అరెస్టు చేశారు పోలీసులు. ఒకరి తర్వాత ఒకరిని వివాహమాడుతూ మోసగిస్తున్న వ్యక్తిని (48) భువనేశ్వర్ లో ప‌ట్టుకున్నారు. ఒడిశాలోని కేంద్రపర జిల్లా పత్కుర పోలీస్ స్టేషర్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన సదరు వ్యక్తి ఇప్పటి వరకు 14 మందిని పెళ్లి చేసుకున్న‌ట్టు భువనేశ్వర్ డీసీపీ ఉమేష్ కుమార్ దాస్ తెలిపారు. 1982లో మొదటి సారి వివాహం చేసుకున్నాడని, ఆ తర్వాత 2022లో రెండోసారి పెళ్లిపీటలు ఎక్కిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు భార్యలకు కలిపి ఐదుగురు పిల్లలున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే.. మ్యాట్రీమోనీ వెబ్ సైట్లలో ప్రొఫైల్ పెట్టి సంబంధం వెతుక్కునేవాడ‌ని, ఈ విషయం భార్యలకు తెలియకుండా జాగ్రత్త పడేవాడ‌న్నారు పోలీసులు. ఇలా ఒక‌రికి తెలియ‌కుడా మ‌రొక‌రిని 14 మంది మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. చివరి భార్య ఢిల్లీలో స్కూల్ టీచర్, ఆమెకు తన భర్త పూర్వపు వివాహాల గురించి తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచార‌ణ జ‌రిపిన పోలీసుల‌కు త‌న మోసాలు ఒక్కొక్క‌టిగా వెలుగు చూశాయి. మాట్రిమోనీ సైట్లలో విడాకులు తీసుకుని, ఒంటరి జీవితం గడుపుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకునే వాడని, పెళ్లి చేసుకున్న తర్వాత వారి వద్ద డబ్బు తీసుకుని ఉడాయించడమే అతడి వ్యాపకంగా మారిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇతడి బాధిత భార్యల్లో కేంద్ర పారా మిలటరీ దళంలో పనిచేసే మహిళ కూడా ఉండడం గమనార్హం. ఢిల్లీ, పంజాబ్, అసోమ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఇతడికి భార్యలున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement