Wednesday, April 24, 2024

Medals | అంతర్జాతీయ క్రీడా పోటీల్లో టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సత్తా.. అభినందించిన సజ్జనర్‌

సౌత్‌ కొరియాలో ఈ మ‌ధ్య జరిగిన ఇంటర్నేషనల్‌ ఆసియా-పసిఫిక్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆర్చ‌రీలో రెండు పతకాలను సాధించారు. జీడిమెట్ల డిపో కండక్టర్ ఎం.అంజలి ఆర్చరీ 18 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించ‌గా.. కరీంనగర్ జోనల్ వర్క్ షాప్ మెకానిక్ కె.కిషన్ 30 మీటర్ల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు.

హైదరాబాద్ లో ఫిబ్రవరిలో జరిగిన ఆలిండియా మాస్టర్స్‌ గేమ్స్‌ లో వీరు సత్తా చాటడంతో ఇంటర్నేషనల్‌ ఆసియా-పసిఫిక్‌ మాస్టర్స్‌ గేమ్స్‌కు ఎంపికయ్యారు. సౌత్ కొరియాలోని జియోన్‌బుక్ లో ఈ నెల 12వ తేదీ నుంచి 20వరకు ఈ పోటీలు జరిగాయి. వీరిద్దరి ప్రతిభను గుర్తించిన సంస్థ సౌత్ కొరియాకు వారిని పంపించడంతో రెండు పతకాలు సాధించారు. ఇంటర్నేషనల్‌ ఆసియా-పసిఫిక్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటి 2 పతకాలు సాధించడంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఇవ్వాల (మంగళవారం) పతకాలు సాధించిన ఎం.అంజలి, కె.కిషన్‌ ను అభినందించారు.

అంతర్జాతీయ క్రీడల్లో రాణించి రెండు పతకాలు సాధించడం సంస్థకు ఎంతో గ‌ర్వ‌కార‌ణం అన్నారు వీసీ స‌జ్జ‌నార్‌. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ అన్నివిధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. భవిష్యత్ లో జరిగే పోటీల్లోనూ పాల్గొని సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. నిరంతర కృషి, ప్రాక్టిస్‌తోనే క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. తమను సౌత్ కొరియా పంపించి ప్రోత్సహించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ కు ఎం.అంజలి, కె.కిషన్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ యాదగిరి, సీపీఎం కృష్ణకాంత్‌, ఫిజియో హిమన్షు కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement