Saturday, April 20, 2024

ఆదిలాబాద్‌లో సీసీఐను పున:ప్రారంభించాలి: కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్

ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా(CCI) యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్‌లోని సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని గుర్తుచేశారు. నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు, 170 ఎకరాల సిసిఐ టౌన్ షిప్, 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. 2 కేవీఎ విద్యుత్‌ సరఫరా వ్యవస్థతో పాటు  ఉత్పత్తికి సరిపడా నీటి లభ్యత కూడా ఈ సంస్థకు ఉందన్నారు. భౌగోళికంగా అదిలాబాద్‌కున్న సానుకూలతను ఉపయోగించుకుని సిసిఐ యూనిట్‌ పునఃప్రారంభిస్తే తెలంగాణ అవసరాలకే కాకుండా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి సిమెంట్‌ సప్లై చేసేందుకు వీలవుతుందన్నారు. వెనుకబడిన మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్‌ జిల్లాల్లో సీసీఐ తిరిగి తెరిస్తే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. గిరిజనులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉండే ఈ ప్రాంతంలో సిసిఐ కంపెనీని తిరిగి ప్రారంభిస్తే అదిలాబాద్‌కు చెందిన స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో టీఎస్‌ఐపాస్ వంటి అద్భుతమైన విధానం రూపొందించామన్న కేటీఆర్, తమ నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు.  తమ ప్రయత్నాలు ఫలించి ఆదిలాబాద్‌లాంటి ప్రాంతాలకు సైతం నూతన పరిశ్రమలు వచ్చాయన్నారు. ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ఒరియంట్ సిమెంట్ తన దేవాపూర్ ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెట్టింపు చేసేందుకు సుమారు రూ.1500 కోట్ల (215 మిలియన్ డాలర్లు) పైగా భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణలో నిర్మాణ రంగం దూకుడు మీదున్నదని, భవిష్యత్తులోనూ ఈ రంగం మరింత పురోగతి సాగిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఇక్కడ సిమెంట్‌కు దీర్ఘకాలిక డిమాండ్ ఉండే అవకాశం ఉందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.   దేశీయంగా సిమెంట్ పరిశ్రమ పురోగతి అద్భుతంగా ఉందని, సిమెంట్ కంపెనీల లాభాలు కూడా ఏటేటా భారీగా పెరుగుతున్నాయన్నారు.

దేశంలో రానున్న రోజుల్లో సిమెంట్ ఉత్పత్తికి దేశీయంగా భారీగా డిమాండ్ పెరుగుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 2021లో ప్రారంభించిన గతిశక్తి-నేషనల్ మాస్టర్ ప్లాన్ పథకం ద్వారా పెద్ద ఎత్తున రహదారి వ్యవస్థ బలోపేతం కోసం పనులు చేపడతామన్నారు. దీంతోపాటు మౌలిక వసతుల కల్పన, పేదల పక్కా గృహాల నిర్మాణంపై కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక శ్రద్ధ, నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న నిర్మాణ పనుల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో సిమెంట్‌కు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంటుందని ICRA, CRISIL, సిమెంట్ మ్యాన్యూఫాక్చర్స్ అసోషియేషన్ లాంటి సంస్ధలు అంచనా వేస్తున్నాయన్నారు. భారతదేశం సిమెంట్ ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని, మరిన్ని సిమెంట్ సంస్థలు ఉత్పత్తి ప్రారంభిస్తే అంతర్జాతీయంగా భారత్ తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రానున్న పదేళ్లలో అరబ్ దేశాలతోపాటు, ఆఫ్రికా దేశాలకు సిమెంట్ ఎగుమతి చేసే ప్రధాన ఎగుమతిదారుగా నిలిచేందుకు వీలుందన్నారు. ఈ విషయంలో కేంద్రం దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించాలని సూచించారు.

ఇన్ని సానుకూలాంశాలున్నా కేంద్ర ప్రభుత్వం సీసీఐ యూనిట్ తిరిగి తెరిచేందుకు నాన్చివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదిలాబాద్‌లోని సీసీఐ తిరిగి తెరవడం రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు చేయూతగా నిలుస్తుందన్నారు. ఆదిలాబాద్‌ సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను తిరిగి తెరుస్తామంటే నూతన పరిశ్రమలకు ఇచ్చే మాదిరే అన్ని ప్రొత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. సీసీఐ కంపెనీ పునః ప్రారంభానికి తన వంతు ప్రయత్నాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తూనే వస్తుందన్నారు. గతంలో పలుసార్లు ఈ విషయంలో కేంద్రాన్ని కోరామని, కేంద్ర మంత్రులు అనంత్ గీతే, మహేంద్రనాథ్ పాండేలకు తమ ప్రభుత్వం తరఫున విజ్తప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అనేకసార్లు ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరినా ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదని అవేదన వ్యక్తం చేశారు.

ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తుంటే, మరోవైపు రాష్ర్ట ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చినా, సీసీఐ యూనిట్‌ను పున:ప్రారంభించకపోవడమంటే తెలంగాణ యువతకు, ముఖ్యంగా అదిలాబాద్ యువతకు తీరని ద్రోహం చేసినట్టేనన్నారు. తెలంగాణ యువతకు సాధ్యమైనన్ని ఎక్కువ ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, తాము చేస్తున్న ఈ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచి, సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదిలాబాద్‌ యూనిట్‌ను తిరిగి తెరుస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్‌ వ్యక్తం చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement