Friday, March 29, 2024

White Revolution | సాంకేతికతతో పునరుజ్జీవనం.. డెయిరీ ఫార్మింగ్‌లో నూతన శకం

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌): పాడి ఉత్పత్తి, పాల వినియోగం భారతదేశానికి సాంస్కృతికంగా, ఆర్థికంగా అంతర్భాగాలుగా నిలుస్తున్నాయని సిద్స్‌ ఫార్మ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు డాక్ట‌ర్ కిషోర్‌ ఇందుకూరి అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా 536 మిలియన్ల పశు సంపద ఉండగా, వీటిలో 300 మిలియన్ పాలిచ్చే పశువులున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి (25శాతం), ప్రపంచ పాడి పరిశ్రమలో 1998 నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న భారతదేశం, వినియోగ మార్కెట్‌తో బలీయంగా మారిందన్నారు. పాడి పరిశ్రమకు సంబంధించిన టెక్‌ ప్రేరేపిత ఉత్పత్తులు, సేవలు, నూతన యుగపు పరిష్కారాలు ఇటీవలి సంవత్సరాల్లో పుంజుకున్నాయ‌ని వివ‌రించారు..

427గ్రాముల రోజువారి తలసరి పాల వినియోగంతో భారత్‌, ప్రపంచ సగటు 305 గ్రాములను భారీ వ్యత్యాసంతో అధిగమించింది. దీనికి అత్యంత ముఖ్య కారణం జనాభా. భారతదేశ జనాభాలో సుమారు 33శాతం మంది 14 సంవత్సరాలకంటే తక్కువ వయస్సున్న పిల్లలని, వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న ఆదాయాలు కూడా కీలకంగా నిలుస్తున్నాయని డాక్ట‌ర్ కిషోర్ చెప్పారు. దేశంలోని పాడి పరిశ్రమ 2025 నాటికి 355 బిలియన్ల డాలర్ల మార్కెట్‌ విలువను లక్ష్యంగా పెట్టుకుందని, నేరుగా వినియోగదారులకు డెలివరీ అందించడం, రైతులకు డిజిటల్‌ చెల్లింపులు వంటివి యధావిధిగా వ్యాపారాన్ని విప్లవాత్మకంగా మార్చాయని తెలిపారు.

స్మార్ట్‌ డెయిరీ వాస్తవమా.
నూతన తరపు సాంకేతికత ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వంటివి మార్కెట్‌లో కలిసి పోతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో సహకారరంగానికి పన్నుల ప్రోత్సాహకాలను అందించడంతో పాటు-, డెయిరీ డెవలప్‌మెంట్‌కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక వంటి కార్యక్రమాలను అమలు పరుస్తోంది. ఐవోటీ, ఏఐవంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పశు పోషణలో ఏకీకృతం చేయడంతో, భారతీయ పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉంది.

- Advertisement -

స్టార్ట్‌ డెయిరీతో దీర్ఘకాలిక ప్రయోజనాలు
ఐవోటీతో కూడిన స్మార్ట్‌ డెయిరీ ఫార్మింగ్‌ మొదట్లో చాలా ఖర్చుతో కూడుకున్నది కావచ్చు, అయితే ఖర్చు రికవరీ, పాల ఉత్పత్తుల నాణ్యత, వనరుల సామర్థం, మెరుగైన జంతుఆరోగ్యం పరంగా దాని దీర్ఘకాలిక ప్రయోజనాలు చాలా గొప్ప అవకాశంగా నిలుస్తాయని సిద్స్‌ ఫార్మ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు డాక్ట‌ర్‌ కిషోర్‌ ఇందుకూరి తెలిపారు. ఐవోటీ, ఏఐ సాంకేతికత డెయిరీరంగాన్ని ఆప్టిమైజ్‌ చేయడంలో, పెరుగుతున్న బిలియన్ల జనాభా డిమాండ్‌ను తీర్చడంలో అమూల్యమైనదని రుజువవుతుందన్ని ఆయన తెలిపారు. బయోమెట్రిక్‌ ఆధారిత గుర్తింపు, వ్యాధి నియంత్రణ, సరఫరా గొలుసు పర్యవేక్షణ, రోబోటిక్‌ టెక్నాలజీ, ట్రేస్‌ బిలిటీ సిస్టమ్‌ల నుండి యూఏవీల వరకు, పరిశ్రమలో మరింత పురోగతికి అవకాశాలు అపారంగా ఉన్నాయన్నారు.

డెయిరీ ఫార్మింగ్‌ కోసం ప్రభుత్వ పాలసీలు బూస్టర్లుగా ఉపయోగపడుతున్నాయని, దీంతో విధానపరంగా కూడా వృద్ధిని సూచిస్తోందన్నారు. రూ.15,000 కోట్ల పశు సంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, డెయిరీ ప్రాసెసింగ్‌, అనుబంధిత విలువ జోడింపు ప్రాజెక్టుల్లో గ్రీన్‌ ఫీల్డ్‌, బ్రౌన్‌ ఫీల్డ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు. గేమ్‌ ఛేంజింగ్‌ టెక్నాలజీని స్వీకరించడంతో, భారతదేశం పాడి పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చేస్తూనే ఉందని, రాబోయే సంవత్సరాల్లో మంచి భవిష్యత్తును కలిగి ఉంటుందన్నారు కిషోర్‌. అయినప్పటికీ, ఉత్పత్తులు, పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి డాటా సెట్‌లు లేకపోవడం వంటి సాంకేతిక రోడ్‌ బ్లాక్‌ లను అధిగమించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement