Thursday, April 18, 2024

అంబానీకి అప్పులు.. అమ్మకానికి ఆస్తులు

అంబానీ బ్రదర్స్‌లో ఒకరైన అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోయారు. ముఖేష్ అంబానీ ఆస్తుల పరంగా దూసుకెళ్తుంటే.. అనిల్ అంబానీ మాత్రం అప్పుల కోసం ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఈ మేరకు అనిల్ అంబానీ నేతృత్వతంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తన ‘రిలయన్స్ సెంటర్’ ప్రధాన కార్యాలయాన్ని రూ. 1,200 కోట్లకు యస్ బ్యాంకుకు విక్రయించింది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని అందులోంచి బయటపడేసేందుకు వేల కోట్ల విలువ చేసే తన ఆస్తిని అనిల్ అంబానీ అమ్మేశారు.

కాగా ఈ కార్యాలయాన్ని తన కార్పొరేట్ ప్రధాన కార్యాలయంగా వినియోగించనున్నట్టు యస్ బ్యాంకు వెల్లడించింది. బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పును తీర్చడానికే ఈ ఆస్తిని అమ్మినట్టు కంపెనీ ప్రకటన చేసింది. 2021లో రుణ రహిత సంస్థగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో కూడా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన రెండు ఆస్తులను విక్రయించింది. ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్ రూ. 3,600 కోట్లకు, పర్బతి కోల్డామ్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్‌ను రూ. 900 కోట్లకు విక్రయించింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా యస్ బ్యాంకుకు రూ. 2 వేల కోట్ల బకాయిలు ఉంది. అప్పులను తీర్చిన ప్రకటన వచ్చిన అనంతరం కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా దూసుకెళ్లింది. 10 శాతం వరకు ర్యాలీ చేసిన తర్వాత మిడ్-సెషన్ సమయంలో 7.98 శాతంతో ఇంట్రాడే గరిష్ఠ స్థాయి వద్ద ట్రేడయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement