Thursday, April 25, 2024

Rajya sabha: వ‌డ్ల కొనుగోలుపై తెలంగాణ సర్కార్ రాజకీయం: పీయూష్ గోయల్

వ‌డ్ల‌ కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోంద‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. శుక్రవారం రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో స్పష్టం చేయాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కె. కేశవరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రశ్నకు రాజ్య‌స‌భ‌లో మంత్రి పీయూష్ గోయల్ సమాధానం చెప్పారు. ఏటా వ‌రి ధాన్యం కొనుగోళ్లను పెంచుకుంటూ పోతున్నామని కేంద్ర మంత్రి గోయల్ చెప్పారు.

వ‌డ్ల కొనుగోలు విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది.ఇవాళ ఈ విషయమై టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న‌ ఎంఓయూ ఆధారంగా కొనుగోళ్లు చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఖరీఫ్ సీజన్ ద్వారా యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయమై ఆలోచిద్దామని మంత్రి రాజ్యసభలో తేల్చి చెప్పారు. అన్ని రాష్ట్రాలతో వరి ధాన్యం కొనుగోలు విషయమై ఎంఓయూలు చేసుకొంటామని ఆయన గుర్తు చేశారు. దీని ప్రకారంగానే తాము ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం తమకు లేఖ ఇచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుర్తు చేశారు.

ఇదే విషయమై మంత్రి సమాధానానికి ముందు, ఆ తర్వాత కూడా టీఆర్ఎస్ ఎంపీలు కె. కేశవరావు, కెఆర్ సురేష్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తాయని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు తెలంగాణలో ప్రతి గింజ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఓ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనను టీఆర్ఎస్ ఎంపీ కేకే పీయూష్ గోయల్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని మంత్రికి చూపారు. గత ఏడాది 94 లక్షల మెట్రిక్ టకన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 19 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని కేశవరావు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకొచ్చారు.

ఇంకా ఎంత కొంటారో కేంద్రం చెప్పాలని కేశవరావు డిమాండ్ చేశారు. అంతేకాదు రకాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో 60 శాతం వరి సాగరు విస్తీర్ణం పెరిగిన విషయాన్ని కేశవరావు గుర్తు చేశారు. మరో వైపు ఇదే విషయమై మరో టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి కూడా మాట్లాడారు. రెండేళ్లకు సరిపడు బాయిల్డ్ రైస్ ను సరఫరా చేసేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్దంగా ఉందని సురేష్ రెడ్డి చెప్పారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల తర్వాత యాసంగి సంగతి చూద్దామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటనపై మరో టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి స్పందించారు. యాసంగి పంట వేయకముందే రైతులకు వ‌రిపంట‌ వేయాలా వద్దా అనే విషయమై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ స్పష్టత ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. కేంద్ర మంత్రులే పరస్పర విరుద్ధ‌ ప్రకటనలు చేస్తున్నారని ఎంపీ సురేష్ రెడ్డి గుర్తు చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement