Thursday, April 25, 2024

Letter: రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా అప్ గ్రేడ్ చేయాలి.. కిషన్ రెడ్డికి, బోయినపల్లి లేఖ

హైదరాబాద్ నుంచి రామగుండం వయా సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి రాజీవ్ రహదారిని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే గా అప్ గ్రేడ్ చేయాలని, రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి కి సోమవారం లేఖ రాశారు. రాజీవ్ రహదారిలో వాహనాల రాకపోకలు పెరిగి రద్దీగా మారడమే కాకుండా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. రాజీవ్ రహదారిని నేషనల్ హైవే గా అప్ గ్రేడ్ చేయాలని, మహారాష్ట్ర లోని చంద్రపూర్, నాగ్ పూర్ వరకు రాజీవ్ రహదారిని విస్తరించాలని కరీంనగర్ ఎంపీగా 12-2-2019 నాడు పార్లమెంటులో ప్రస్తావించిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 30 లో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేయాలని, మారుమూల ప్రాంతాలకు కూడా రహదారి కనెక్టివిటీ పెంచాలని వినోద్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి నేషనల్ హైవే కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలని తనతోపాటు సహచర టీ.ఆర్.ఎస్. ఎంపీలు అప్పటి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరామని, సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపి ఇప్పటికీ ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని వినోద్ కుమార్ తెలిపారు.

పెద్దపల్లి జిల్లాకు జాతీయ రహదారితో కనెక్టివిటీ ఇప్పటి వరకు లేదని, రాజీవ్ రహదారిని నేషనల్ హైవే గా అప్ గ్రేడ్ చేస్తే పెద్దపల్లి జిల్లాకు జాతీయ రహదారి కనెక్టివిటీ కలుగుతుందని, పెద్దపల్లి జిల్లాను కలుపుకుని 33 జిల్లాలకు జాతీయ రహదారి సౌకర్యం కలుగుతుందని వినోద్ కుమార్ అన్నారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని, రాష్ట్రానికి సముచిత న్యాయం జరిగేలా కృషి చేయాలని వినోద్ కుమార్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement